ఆమె పేరు రష్మీ. చార్మినార్ వాసి. ఈ నెల 24న ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. సమయం రాత్రి 12:20 గంటలు. ఓ వైపు లాక్డౌన్.. మరోవైపు అంబులెన్స్లైన్స్ బిజీగా ఉన్నాయి.
ఆ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఏం చేయాలో తెలియక అయోమయానికి గురయ్యారు.
ఆ సమయంలో వాళ్లు ఒక నెంబర్కు ఫోన్ చేసి విషయం వివరించారు. వెంటనే
పది నిమిషాల్లో వాహనం వారి ఇంటి ముందుకు వచ్చింది. ఆ వాహనంలో వాళ్లంతా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్లారు. గంటన్నర తర్వాత ఆ గర్భిణికి పండంటి బిడ్డ జన్మించింది.”
ఈ సేవలు అందించి ఆమె ప్రాణానికి భరోసానిచ్చింది.. తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్.
సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ): కొవిడ్ కష్టకాలంలో ఒక అసోసియేషన్గా ఏర్పడిన డ్రైవరన్నలు గర్భిణులకు అండగా నిలుస్తున్నారు. ఏ క్షణం ఎలాంటి అత్యవసరం ఏర్పడుతుందో తెలియని పరిస్థితి గర్భిణులది. అలాంటి పరిస్థితుల్లో వారికి ఏ సమయంలోనైనా ఉచిత అత్యవసర రవాణా సదుపాయం కల్పించి భరోసా ఇస్తున్నారు డ్రైవరన్నలు. ఇటీవల వారి కోసం నగర వ్యాప్తంగా ఉచిత రవాణా సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్’ సభ్యులు చేస్తున్న ఈ సాయం పలువురి ప్రశంసలు పొందుతుంది. ఇప్పటి వరకు 67 మందిని క్షేమంగా ఆసుపత్రికి చేర్చారు. ఒక్క ఫోన్ చేస్తే చాలు నిర్ణీత సమయంలో వెహికిల్ ఇంటికి చేరుకుంటుంది. అందుకు నగర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో క్యాబ్ డ్రైవర్లు సిద్ధంగా ఉంటారు. అత్యవసరం ఉన్న వారు ఫోన్ నం: 91776 24678 లో సంప్రదించాలని అసోసియేషన్ పిలుపునిచ్చింది.
మా కాల్ వచ్చిన అరగంట లోపల చిరునామాకు చేరుకుంటాం. వారు ఏ ఆసుపత్రిలో చేరాలనుకున్నా అక్కడి వరకు తీసుకెళ్తాం. కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తాం. మాస్క్ ధరించడం, వాహనం శానిటైజేషన్ చేస్తాం. ప్రతి రోజు ముగ్గురినైనా ఆసుత్రికి చేరుస్తున్నాను. కొంతమంది అత్యవసం కాకపోయినా కాల్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వెళ్లాల్సి వస్తుంది. కాని, మా లక్ష్యం అది కాదు. అత్యవసరంగా సేవలు అవసరం ఉంటేనే కాల్ చేస్తే మంచిది. నిజంగా అవసరమున్న వారికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే అందరూ అర్థం చేసుకోవాలి.
కరోనా విపత్కర కాలంలో గర్భిణుల మెడికల్ అత్యవసర సేవలకు ఉచితంగా వాహన సర్వీస్ అందిస్తున్నాం. వారిని క్షేమంగా ఆసుపత్రికి చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ సర్వీస్ను ప్రారంభించాం. వారి నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. అందులో అత్యవసరం ఉన్న వారికి మాత్రమే సేవలు అందిస్తున్నాం. వారిని ఆసుపత్రి నుంచి ఇంటికి కూడా చేరుస్తున్నాం. సమయంతో సంబంధం లేదు. వారికి ఎప్పుడు ఎలాంటి ఎమర్జెనీ వస్తుందో తెలియదు. లాక్డైన్లో వాహనాలు కూడా అందుబాటులో లేవు. అందుకే మా ప్రెసిడెంట్ సలావుద్దిన్ నిర్ణయం మేరకు ఈ సేవలను అందిస్తున్నాం.