హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ):పాఠశాలలు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకోసం సమీప గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు రవాణా భత్యాన్ని మంజూరుచేస్తూ విద్యాశాఖ జీవో ఇచ్చింది. 2021-22 సంవత్సరానికి రూ.24.35 కోట్లు విడుదలచేస్తూ ఆశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సల్తానియా గురువారం జీవో జారీచేశారు. ఇప్పటివరకు 1-8 తరగతుల వారికి మాత్రమే రవాణాభత్యం అందజేస్తుండగా.. ఈ ఏడాది నుంచి 9, 10 తరగతులవారికి సైతం వర్తింపజేశారు. పలు గ్రామాల విద్యార్థులు సమీప గ్రామాల్లోని పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వీరిలో కొందరు ఆటోలు, మరికొందరు వ్యాన్లు, ఇతర వాహనాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం వీరికి రవాణాభత్యాన్ని అందజేయాల్సి ఉన్నది. 1-5వ తరగతి వరకు ఒక కిలోమీటర్, 8వ తరగతి వరకు 3 కిలోమీటర్లు, 9, 10 తరగతులకు 5 కిలోమీటర్ల దూరంలోని స్కూళ్లల్లో చదువుకుంటే రవాణాభత్యం ఇవ్వాలి. తాజా నిర్ణయంతో 1-10వ తరగతి వరకు గల మొత్తం 40,598 మంది విద్యార్థులకు సంవత్సరానికి ఒక్కొక్కరికి సుమారు రూ.6 వేల చొప్పున రవాణాభత్యం పిల్లల ఖాతాలో జమకానున్నది. కరోనాతో పాఠశాలలు నడవకపోయినా, తరగతులు నిర్వహించకపోయినా రవాణాభత్యాన్ని ఇవ్వనుండటం గమనార్హం.