తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమ, మిషన్ భగీరథ వంటి పథకాల వల్ల రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని ర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవ సమావేశం రాజేంద్రనగర్లోని వర్సిటీ ఆడిటోరియంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వ్యవసాయ శాస్త్రవేత్తల అవిరళ కృషి, ప్రభుత్వ సహకారం వల్ల సాగులో అధిక దిగుబడులు సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనతి కాలంలోనే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుత గడ్డు కాలం కొవిడ్లోనూ రాష్ట్రం ఆహార ధాన్యాలు, నూనె గింజలు, పత్తిలో రికార్డు స్థాయిలో ఉత్పత్తులు సాధించామన్నారు. వ్యవసాయం ఆధునికత వైపు వాణిజ్యసరళి వైపు మారాలన్నారు.
కొత్తగా ఈ విద్యనభ్యశించిన వారు ఐటీ, డిజిటల్ టెక్నాలజీల వంటి వాటిని ఉపయోగించుకుని అగ్రి బిజినెస్లో ప్రవేశించాలన్నారు. అనేక రంగాలో విప్లవాత్మక పథకాలని అమలు చేస్తూ తెలంగాణ దేశానికి మార్గదర్శిగా నిలుస్తోందని కొనియాడారు. వర్సిటీ ఉప కులపతి డా॥ వి.ప్రవీణ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నివేదికను సమర్పించారు. కొవిడ్ నేపథ్యంలో స్నాతకోత్సవం ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ పంటలకు చెందిన 7 వెరైటీలను విడుదల చేశామన్నారు. మరో ఏడు వెరైటీలు జాతీయ స్థాయిలో ఆమోదం పొందాయన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యులు ముఖ్య అతిథి ఫ్రొ. రమేష్చంద్, వర్సిటీ రిజిస్టర్ డా॥ ఎస్.సుధీర్ కుమార్, వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా॥ జగదీశ్వర్, ఆయా రంగాలకు చెందిన డీన్లు, వర్సిటీ బోర్డు అధికారులు పాల్గొన్నారు.