వ్యవసాయ యూనివర్సిటీ జూన్ 15: నిరంతరం కష్టపడే రైతులు, విత్తనాలు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అపారమైన నష్టాన్ని చవిచూసే ప్రమాదాలు ఉంటాయని, ప్రస్తుతం, విత్తనాలను త్వరగా కొనాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్ సూచించారు. ఇప్పటికే వాతావరణంలో సాగుకు అనుకూలంగా మార్పులు వచ్చాయి. వర్షాధారంపై సాగు చేసే జొన్న, మొక్క జొన్న, ఆముదం, కంది, తదితర మెట్ట సాగు ప్రారంభమైంది. విత్తన కొనుగోలుపై ప్రస్తుతం అప్రమత్తవగా వ్యవహరిస్తే సిరులు పండించుకోవచ్చన్నారు.
విత్తనాలు కొనేటప్పుడు అర్హత గల గుర్తింపు పొందిన వారి వద్దే కొనాలన్నారు. వ్యాపారి నుంచి పక్కా రశీదు తీసుకుని దాన్ని సీజన్ చివరి వరకు భద్రపర్చుకోవాలి. విత్తనాలు అమ్మే అధీకృతి లైసెన్స్లున్న డీలర్లు, చిల్లర వ్యాపారుల నుంచి మాత్రమే రైతులు విత్తనాలను కొనాలని అవగాహన పెంపొందిస్తున్నారు. గ్రామాల్లోని చిన్న చిన్న దుకాణాల్లో విత్తన ప్యాకెట్లు అమ్యుతున్న కొందరికి లైసెన్సులు ఉండక పోవచ్చన్నారు. విత్తనాలు ఎక్కడ ఉత్పిత్తి చేశారు? ఎక్కడ శుద్ధి చేశారనేది? ప్యాకెట్ లేదా విత్తన సంచి పై ఉందో లేదో చూడాలి.
జన్యు స్వచ్ఛత, మొలక శాతం, విత్తనాల వాడుక గడువు తేది గుర్తించాలి. ధర, కంపెని, పేరు, బ్రాండు వివరాలు, విత్తనాల రకం, సంకర జాతి తదితర వివరాలు ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలించాలి. విత్తన తయారీ కంపెనీ, చిరునామా, ఫోన్ నంబర్లు తదితర వివరాలు పొందుపర్చారా? లేదా? తదితర జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన టెక్నాజీ ప్రకారం, క్యూఆర్ కోడ్ రూపంలో ముద్రించి ఉంటాయి. రైతు తన సెల్ఫోన్తో ఆ కోడ్ను స్కాన్ చేస్తే అందులోని వివరాలన్ని ఫోన్లో కనిపిస్తాయని సూచించారు.