సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): క్షయ వ్యాధిగ్రస్తులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం నూతనంగా ‘టీబీ ఆరోగ్య సాథి’ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో క్షయ వ్యాధి నిర్మూలనకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, రోగులకు అందుబాటులో ఉన్న వైద్య విధానాలు, ప్రభుత్వం అందిస్తన్న వైద్య సేవలను పొందుపరిచారు. అంతేకాక క్షయ వ్యాధి విభాగానికి చెందిన వైద్యాధికారుల వివరాలు, వ్యాధి లక్షణాలతో పాటు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, కాల్సెంటర్ నంబర్ కూడా ఇందులో పెట్టారు. క్షయవ్యాధి లక్షణాలు ఉన్నవారు ఈ యాప్లో తమ పేర్లను నమోదు చేసుకొని దగ్గరలో ఉన్న టీబీ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు.
‘టిబి ఆరోగ్య సాథి’లో ప్రతి మెడికల్ ఆఫీసర్, ఆరోగ్య కార్యకర్త, పారా మెడికల్ స్టాఫ్, ఆశ వర్కర్ల వివరాలు ఉంటాయి. వీటితో పాటు టీబీ రోగులు వారి సన్నిహితుల వివరాలు సైతం పొందుపర్చడంతో అటు వైద్యులు.. ఇటు రోగులకు ఈ యాప్ వారధిగా నిలవనున్నది. ఈ యాప్ ద్వారా సంబంధిత వైద్యాధికారులు ఆశ, ఆరోగ్య కార్యకర్తలతో నేరుగా సంప్రదించే వీలుంటుంది. వ్యాధి, చికిత్సపై ఉన్న సందేహాలను రోగులను సులభంగా నివృత్తి చేసుకోవచ్చు.
2025 నాటికి దేశంలో టీబీని పూర్తిగా నిర్మూలించేందుకు ‘టిబి ఆరోగ్య సాథి’ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా రోగులకు మెరగైన సేవలు అందుతాయి. వ్యాధిని సకాలంలో గుర్తించడంతో పాటు అవగాహన పెంచుకునేందుకు ఎంతగానో దోహద పడుతుంది. టీబీ లక్షణాలు ఉన్నవారు ఈ యాప్లో వివరాలు నమోదు చేసుకుంటే దగ్గరలోని టీబీ కేంద్రాన్ని సూచిస్తుంది. – డాక్టర్ స్వరాజ్యలక్షి, రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో