సిటీబ్యూరో, సెప్టెంబరు 25 (నమస్తే తెలంగాణ) : మట్టి గాజులు… ముత్యాల హారాలు… కృత్రిమ జ్యువెలరీ… అత్తరు… ఇలా మగువల మనసు దోచే ఆభరణాలు, వస్తువుల కోసం మీరు చార్మినార్ వరకు వెళ్లాల్సిన పని లేదు. ఈ ఆదివారం నుంచి ‘సన్డే ఫన్డే’ కార్యక్రమంలో చార్మినార్ షాపింగ్ మొత్తం ట్యాంక్బండ్పైకి రానున్నది. ఇవే కాదు… ఆర్కెస్ట్రా, ఒగ్గుడోలు, బాణసంచా, టీఎస్ పోలీస్బ్యాండ్… ఇలా మరిన్ని అదనపు హంగులు నగరవాసులకు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి. నాలుగు వారాల కిత్రం ట్యాంక్బండ్పై మొదలైన సన్డే ఫన్డే సందడి వారానికో ప్రత్యేకతతో నగరవాసులను అలరిస్తుంది.
ఇప్పటివరకు సాయంత్రం 5గంటల నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం ఇక నుంచి మధ్యాహ్నం 3గంటలకే ప్రారంభమవుతుంది. గత వారం గణేశ్ నిమజ్జనం కారణంగా నిర్వహించలేకపోవడంతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఈ ఆదివారం ధూమ్ ధామ్గా ఏర్పాట్లు చేసింది. దేశ, విదేశాల పర్యాటకులతో పాటు నగరవాసులు సాగర తీరంలో సంధ్యా సమయంలో సరదాగా గడిపేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, సిటీ పోలీస్ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు.
పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంజాయ్ చేసేలా రకరకాల ఈవెంట్లను నిర్వహించనున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసులు మధ్యాహ్నం 3 గంటల నుంచే ట్రాఫిక్ను ట్యాంక్బండ్పైకి రాకుండా నిలిపివేయనున్నారు. ఈ ఆదివారం మరింత కొత్తదనంతో, ప్రత్యేక ఆకర్షణలతో నిర్వహించనున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ ఆర్వింద్ కుమార్ తెలిపారు.
వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ట్యాంక్బండ్పై నిర్వహించే ‘సన్డే ఫన్డే’కు వచ్చే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్ఎండీఏ అధికారులు సూచించారు. గులాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిస్తే ఈ కార్యక్రమాన్ని వచ్చే ఆదివారానికి వాయిదా వేయాలని నిర్ణయించారు. ఒక వేళ ఆదివారం భారీ వర్షం కురిస్తే.. పరిస్థితులను బట్టి ట్యాంక్బండ్పై సన్డే ఫన్డే కార్యక్రమం ఉంటుందని, ఈ విషయాన్ని నగరవాసులు గుర్తించాలని సూచించారు.