అంబర్పేట : వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసు కోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయో గుర్తించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు.
గండిపేట చెరువు గేట్లు ఎత్తడంతో మూసీనది వరద ప్రవాహం అధికమైంది. అంబర్పేట అలీకేఫ్ చౌరస్తా వద్ద మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర అంబర్పేట ఇన్స్పెక్టర్ సుధాకర్, ఇతర అధికారులతో కలిసి మంగళవారం మూసీ వరద ప్రవాహాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
మూసీని ఆనుకొని ఉన్న బస్తీల ప్రజలను అప్రమత్తం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. గత ఏడాది ముంపుకు గురైన బస్తీల ప్రజలను ముందస్తుగా జాగ్రత్త వహించాలని చెప్పారు. అదే విధంగా మూసీ పరివాహక ప్రాంతాలను కాచిగూడ ట్రాఫిక్ పోలీసులతో కలిసి అంబర్పేట సర్కిల్ డీసీ వేణుగోపాల్ పరిశీలించారు.
మూసీకి వరద ఉధృతి పెరగడంతో అలీకేఫ్ వద్ద మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగకుండా రోడ్డును మూసీవేయాలని డీసీ సూచించడంతో కాచిగూడ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను బంద్ చేయించారు. ఇదిలా ఉండగా సోమవారం రోజంతా కురిసిన వాన మంగళవారం తెరిపి ఇవ్వడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.