ఆర్కేపురం : నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లాఎంప్లాయిమెంట్ అధికారి పరమేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం కొత్తపేటలోని శివాని మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన జామ్ మేళా కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల దశలోనే లక్ష్యాన్ని ఏర్పర్చుకొని లక్ష్యసాధనకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత సమయాన్ని వృధా చేయకుండా ఉద్యోగంలో స్థిరపడాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడ కుండా వివిధ సంస్థలు నిర్వహిస్తున్న ఇలాంటి జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
కళాశాల కరస్పాండెంట్ వెదిరె సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కళాశాలలో జామ్ మేళాలు ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన జాబ్ మేళాలలో దాదాపు 1300 వందల మంది హాజరయ్యారని, వారిలో 520 మందిని షార్ట్ లిస్ట్ చేశారని పేర్కొన్నారు. ఓజాస్ ఇన్నోవేట్ టెక్నాలజీస్, వర్చస్ ఐటీ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి, ఆక్సిజ్ బ్యాంక్, బిక్సి,కార్వి, అపోలో ఫార్మసి లాంటి కంపెనీలు ఈ జాబ్లో పాల్గొని వారికి కావాలసిన విద్యార్థులను ఎంపిక చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనిత, కళాశాల అడ్మిన్ అధికారిణి ఎం.సత్తిరెడ్డి, వివిధ కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు.