సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని నిజాం కాలేజీ మైదానంలో టీన్యూస్, అపెక్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2021కు అనూహ్య స్పందన లభించింది. గురువారం నుంచి శనివారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఫెయిర్ కొనసాగుతుంది. ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కాలేజీల స్టాళ్లను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఇప్పటి వరకు ఏడేండ్లు పూర్తి చేసుకుని.. ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు.
ఇంజినీరింగ్, ఎంబీఏ, ఏంసీఏ, ఫార్మసీ వంటి ఉన్నత విద్యావకాశాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యావకాశాలు ఏ విధంగా ఉన్నాయి..? ప్లేస్మెంట్ ఏ కోర్సులకు ఎక్కువగా ఉంది..? ఏయే కాలేజీల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంది..? ఎంసెట్లో ఏ ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్లో సీటు వచ్చే అవకాశం ఉంది.. అన్న వివరాలు ఒకే వేదికపై విద్యార్థులకు ఉచితంగా అందించడం సంతోషదాయకమన్నారు.
ఈ ఫెయిర్లో దాదాపు 100 ఇంజినీరింగ్ కాలేజీలు, ఇతర అనుబంధ విద్యా సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా అనేక మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ ఫెయిర్ను సందర్శించారు. అందుబాటులో ఉన్న కాలేజీలు, కోర్సులు, వాటి భవిష్యత్ గురించి తెలుసుకున్నారు. తొలి రోజు దాదాపు 10 వేలకు పైగా విద్యార్థులు, వారు తల్లిదండ్రులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. కరోనా నేపథ్యంలో సందర్శకులు భౌతిక దూరం పాటించే విధంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. అన్ని స్టాళ్లలో మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.
ఈ కార్యక్రమంలో టీన్యూస్ ఎడిటర్ సురేశ్ బాబు, మర్రి లక్ష్మారెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజీ ప్రిన్సిపాళ్లు కేవీ రెడ్డి, శ్రీనివాసరావు, శ్రేయాస్ ఇంజినీరింగ్ కాలేజీ వైస్ చైర్మన్ హృదయ్ రెడ్డి, టీన్యూస్ సీజీఎం ఉపేందర్, శ్రీదత్తా విద్యా సంస్థల చైర్మన్ పాండురంగారెడ్డి, అపెక్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎండీ దినేశ్కుమార్ గట్టు, టీన్యూస్ డీజీఎం కిరణ్, మార్కెటింగ్ టీం సత్యపాల్ శ్రీనివాస్, భాస్కర్, వెంకట్రెడ్డి, సతీష్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్- 2021కు ప్లాటినం స్పాన్సర్గా మర్రి లక్ష్మణ్రెడ్డి విద్యా సంస్థలు, డైమండ్ స్పాన్సర్గా సీఎంఆర్ విద్యా సంస్థలు, గోల్డ్ స్పాన్సర్గా మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవహరించాయి.