లక్నో : ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నదిలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది శుక్రవారం ప్రమాదవశాత్తులో నీటి మునిగారు. ఇందులో ఇప్పటి వరకు తొమ్మిది మందిని రక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. శుక్రవారం గుప్తార్ ఘాట్ వద్ద స్నానాలు చేస్తున్న క్రమంలో వారంతా నీటి మునిగిపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంకా కుటుంబంలోని ఆరుగురి జాడ తెలియలేదని, వారి కోసం గజ ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడేళ్ల బాలిక నీటిలో ఈదుకుంటూ వచ్చి ప్రాణాలను కాపాడుకుంది. రక్షించిన ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
వీరంతా ఆగ్రాలోని సికందారా ప్రాంతానికి చెందిన మహేశ్ కుమార్ కుటుంబమని.. అయోధ్య సందర్శన కోసం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కుటుంబంలోని కొందరు కాళ్లు కడుక్కోగా.. మరికొందరు స్నానం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఇతర కుటుంబీకులు రక్షించేందుకు ప్రయత్నించినా వారు సైతం అందులో చిక్కుకుపోయారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనుజ్కుమార్ తెలిపారు.