అంబర్పేట, మే 22: ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ వృథా కాకుండా చూడాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. శనివారం సాయంత్రం నల్లకుంట ఫీవర్ దవాఖానను ఆమె సందర్శించారు. ఆక్కడి రెండు, మూడు వార్డుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులను స్వయంగా కలిసి దవాఖానలో అందుతున్న చిక్సిను అడిగి తెలుసుకున్నారు. అడ్మిట్ అయిన ఎన్ని రోజుల వరకు ఆక్సిజన్ ఉపయోగిస్తున్నారు? ఎన్ని రోజుల తరువాత మామూలు స్థితికి వస్తున్నారు? అనే అంశాలను రోగులను అడిగారు. మొత్తం ఎన్ని ఆక్సిజన్ పడకలు ఉన్నాయి? ఎంత మంది చికిత్స పొందుతున్నారని కూడా అడిగారు. దవాఖాన వార్డులన్నీ పరిశీలించిన కలెక్టర్ శానిటేషన్ చాలా బాగుందని కితాబిచ్చారు.
అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కంటే ఇక్కడ శానిటేషన్ నిర్వహణ చాలా బాగుందని మెచ్చుకున్నారు. అనంతరం దవాఖాన ఆవరణలో ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటును సందర్శించారు. ఆరు కిలో లీటర్ల కెపాసిటీ ఉన్న ప్లాంటులో రోజూ ఎంత నింపుతున్నారని అడిగారు. అక్కడ ఉన్న టెక్నికల్ వ్యక్తిని వివరాలు అడిగారు. కొద్దిగా తేడా కనిపించడంతో నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ డా.కె.శంకర్కు చెప్పారు. కలెక్టర్ వెంట దవాఖాన ఆర్ఎంవో డా.జయలక్ష్మి, డిప్యూటీ ఆర్ఎంవో డా.చంద్రశేఖర్, హిమాయత్నగర్ తాసీల్దార్ లలిత, ఫార్మసిస్టు జె.అశోక్ తదితరులు పాల్గొన్నారు.