సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగురోడ్డును నిరంతరం పరిశుభ్రంగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్ తెలిపారు. బుధవారం నానక్రాంగూడ ఔటర్ రింగురోడ్డుపై ఉన్న టోల్ప్లాజా వద్ద నాలుగు అత్యాధునిక స్వీపింగ్ యంత్రాలను ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ ఔటర్ రింగు రోడ్డు నిర్వహణను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. ఇప్పటికే హరితహారం కింద కోట్లాది మొక్కలను నాటిందని, అదేవిధంగా 158 కి.మీ పొడవునా ఉన్న ఓఆర్ఆర్పై దుమ్ము, ధూళి, ఇతర వ్యర్థాలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేందుకు రూ.5 కోట్ల వ్యయంతో నాలుగు స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేశామన్నారు.
వీటిని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఉంచి నెలలో 5 ఐదు మార్లు ఓఆర్ఆర్ మెయిన్ క్యారేజ్వేను శుభ్రం చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. వీటితో పాటు ఔటర్ రింగు రోడ్డుపై ఎల్ఈడీ వీధిదీపాలు, చెట్లు, మొక్కలకు నీరు అందించేందుకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నామని, ఈ పనులు ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, హెచ్జీసీఎల్ సీజీఎంలు రవీందర్, మాజిద్ షరీఫ్, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.