న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీ మేజర్ బిట్కాయిన్కు చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా ఎల్ సాల్వెడార్ నిలిచింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుకు ఆ దేశ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిట్ కాయిన్తో ఎటువంటి లావాదేవీ జరపొచ్చని ఎల్ సాల్వెడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలె చెప్పారు.
టెక్నాలజీయేతర సంస్థలు మినహా మిగతా వ్యాపార సంస్థలు బిట్కాయిన్ మారకంలో చెల్లింపులను స్వీకరించవచ్చని ఎల్ సాల్వేడార్ నిర్ణయించింది. తమ దేశానికి అమెరికా డాలరే అధికారిక కరెన్సీ అని వివరణ ఇచ్చింది.
బిట్కాయిన్ రూపంలో చెల్లింపులు జరపాలంటూ బలవంతమేమీ ఉండదని పేర్కొంది. ఈ క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు జరపడం కోసం ప్రజలకు శిక్షణ ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ తమ అధికారిక డిజిటల్ కరెన్సీగా ప్రకటించాక మూడు నెలలకు కొత్త చట్టం అమల్లోకి వస్తుంది.
అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు, పెట్టుబడులు, పర్యాటకం, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు తమ నిర్ణయం తోడ్పడగలదని ఎల్ సాల్వేడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలె తెలిపారు. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే బిట్కాయిన్ మారకం విలువ పరంగా ఎవరూ నష్టపోయే రిస్క్ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.