సిటీబ్యూరో, మార్చి 24(నమస్తే తెలంగాణ): స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పారిశుధ్య నిర్వహణలో ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే ఇంటింటి చెత్త సేకరణకు ప్రస్తుతం ఉన్న 2500 స్వచ్ఛ ఆటో టిప్పర్లకు అదనంగా మరో 650 స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. హైమాక్స్ థియేటర్ పక్కన హెచ్ఎండీఏ గ్రౌండ్లో జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆటోలను గురువారం ఉదయం 9 గంటలకు మంత్రి కేటీ రామారావు, మేయర్, డిప్యూటీ మేయర్, నగర మంత్రులతో కలిసి ప్రారంభించనున్నారు. కొత్తగా వచ్చిన 650 ఆటో టిప్పర్ల ద్వారా1.5 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరగనున్నది. ఇంటింటికీ చెత్త సేకరణలో భాగంగా ఈ ఆటోల ద్వారా తడి, పొడి చెత్తపై విస్తృత అవగాహన కల్పించనున్నారు.
పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణ
జీహెచ్ఎంసీ పరిధిలో 17ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఉన్నాయి. నగరంలో ప్రతిరోజు 5,600 నుంచి ఆరు వేల మెట్రిక్ టన్నుల మున్సిపల్ వ్యర్థాలు వస్తున్నాయి. వీటిని 2500 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి నుంచి సేకరించడం, కమర్షియల్ ప్రాంతాల ప్రధాన రహదారుల్లో వచ్చే చెత్తను ముందుగా ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు పంపిస్తారు. ఈ సందర్భంగా సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్లను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలన్న ప్రభుత్వ, కోర్టు ఆదేశాలను అనుసరించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమ నిబంధనల ప్రకారం ఆధునీకరణ చేపట్టి నూతన సంవత్సరం నుంచి నిర్వహించనున్నారు. శాస్త్రీయ పద్ధతి ద్వారా వ్యర్థ పదార్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ స్టేషన్లను ఆధునీకరించి నిర్వహించే అతికొద్ది నగరాల్లో హైదరాబాద్ నిలిచిందని అధికారులు తెలిపారు.
ఒక్కో ఆటోలో 600 ఇండ్ల నుంచి చెత్త సేకరణ
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 2500 స్వచ్ఛ ఆటో టిప్పర్లు ఉన్నాయి. డ్రైవర్ కం ఓనర్ పథకం ద్వారా 5 వేల మందికి జీవనోపాధి కల్పించారు. ఒక ఆటోకు డ్రైవర్తో పాటు హెల్పర్ ఉంటారు. వీరంతా సకాలంలో ఇంటి ముందుకు వెళ్లి ఆటో ద్వారా చెత్తను సేకరిస్తారు. కాగా స్వచ్ఛ ఆటో టిప్పర్ల రాకతో 2016 సంవత్సరంలో 3500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండగా 2017 నాటికి 4500 మెట్రిక్ టన్నులకు చేరుకున్నది. ప్రస్తుతం 5,600 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. తాజాగా వచ్చిన 650 స్వచ్ఛ టిప్పర్లను 30 సర్కిళ్లకు కేటాయించనున్నారు. ఈ ఆటోల కేటాయింపును అత్యంత పారదర్శకంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ కం ఓనర్ స్కీంలో భాగంగా 10 శాతం ఖర్చు వెహికల్ తీసుకునే వ్యక్తి నుంచి తీసుకోగా, వాహనం ఖరీదులో మిగతా 90 శాతం వ్యయాన్ని జీహెచ్ఎంసీ భరిస్తుంది. ఇందుకు ఆర్థిక రుణాన్ని కెనరా బ్యాంక్ నుంచి 8శాతం వడ్డీతో 72 నెలల పాటు జీహెచ్ఎంసీ చెల్లించనుంది. ఈ ఆటోలను ఆటోమోటివ్ మ్యాన్ఫ్రాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టెండర్ ద్వారా సమకూర్చింది. ఒక్కో ఆటో కోసం 6.86 లక్షలను ఖర్చు చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు కోసం 44.63 కోట్లు వెచ్చించనున్నది. ఈ ఆటోను పొందిన వారు ఆయా ప్రాంతంలో 600 ఇండ్ల నుంచి చెత్తను సేకరించనున్నారు.