సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): నాలుగురోజుల క్రితం ఫిర్యాదు తీసుకొని తదుపరి వెంటనే చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన చాంద్రాయణగుట్ట ఎస్సై వెంకటేశ్ను సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. కాగా బాధితుడు ఠాణాకు వెళ్లి ప్రాణాపాయం పొంచి ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆ విషయాన్ని పట్టించుకోలేదనే ఆరోపణలు రావడంతో దీన్ని తీవ్రంగా పరిగణించిన సీపీ వెంటనే బాధ్యులపై చర్యలు చేపట్టారు.
వందలాది వాహనాలు ఆగి ఉండగానే వేలాది మంది చూస్తుండగానే వెనక వస్తున్న వాహనాలను ఆపి మరీ కత్తులతో పొడిచి చంపారు. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఈ ఘోర ఉదంతం పాతనగరంలో బుధవారం సాయంత్రం జరిగింది. ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందంటూ నాలుగు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించి తిరిగి బుధవారం పోలీసుల వద్దకు వెళుతుండగానే బాధితుడిని చంపేశారు. చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
చాంద్రాయణగుట్ట, అక్టోబర్ 13 : బార్కాస్ ప్రాంతానికి చెందిన అమీద్ బిన్ అల్ జుబేదీ (37) మిలేనియం ట్రావెల్స్, పాస్పోర్టు ఏజెంట్, వెస్ట్రన్ యూనియన్ మనీ ఆఫీస్ నిర్వహిస్తున్నాడు. డబ్బుల విషయంలో ఇటీవల కొంతమందితో విబేధాలు నెలకొన్నాయి. దీంతో తనకు ప్రాణహాని పొంచి ఉన్నదని గమనించి జుబేదీ నాలుగురోజుల కిందట చాంద్రాయణ గుట్ట పోలీసులను ఆశ్రయించాడు. వారు ఫిర్యాదును స్వీకరించారు. కానీ వెంటనే తగు చర్యలు తీసుకోలేదు. కాగా ప్రత్యర్థులు తనపై ఏ క్షణమైనా దాడిచేయొచ్చని పసిగట్టిన జుబేదీ సాయంత్రం వేళ బార్కాస్ నుంచి చాంద్రాయణ గుట్ట పోలీసుల వద్దకు బయలుదేరాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రత్యర్థులు స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఆషామాబాద్ వద్ద జుబేదీ కారును అడ్డగించారు. ఈ హఠాత్పరిణామానికి భయపడి కారు నుంచి బయటికి వచ్చి పోలీసుల వద్దకు పరిగెత్తే క్రమంలోనే ఆయనను అక్కడికక్కడే దుండగులు కత్తులతో పొడిచి బండరాయిని తలపై బాది చంపారు. ఆ సమయంలో రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు ఆగి ఉండటం గమనార్హం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రక్తం మడుగులో పడి ఉన్న అమీద్ను వైద్యశాలకు తరలిస్తుండగానే మార్గమధ్యలోనే మృతిచెందాడు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరైన రషీద్ నెల రోజుల క్రితమే కోటి రూపాయల విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడటం గమనార్హం. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేసినట్లు ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ మజీద్ తెలిపారు. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ 2019లో ఒక కిలో బంగారం వరకు పట్టుబడిన ఉదంతంలో మృతుడికి, అతడి ప్రత్యర్థుల మధ్య వివాదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ వివాదమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.
హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఆథిల్ జాఫ్రీ, రయీస్, వాహీద్ జాఫ్రీ, సాయిద్ జాఫ్రీగా గుర్తించారు. ఆథిల్ జాఫ్రీ ప్రధాన నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు.