సిటీబ్యూరో, జూన్ 22(నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అడ్డగూడురు పోలీస్ స్టేషన్లో ఈ నెల 18న చోటు చేసుకున్న లాకప్డెత్ విషయంలో సబ్ ఇన్స్పెక్టర్ మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలను సీపీ మహేశ్ భగవత్ మంగళవారం సస్పెండ్ చేశారు. ఈ నెల 18న ఓ దొంగతనం కేసులో ఖమ్మం జిల్లా.. చింతకాని మండలం, కోమట్లగూడెంకు చెందిన మరియమ్మ(45)ను తీసుకువచ్చి విచారించారు. ఈ సమయంలో మరియమ్మ మృతి చెందింది. బాధితులు ఇది లాకప్డెత్ అంటూ ఆరోపణలు, ఫిర్యాదులు చేయడంతో సీపీ మహేశ్ భగవత్ మాల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్ రావును విచారణాధికారిగా నియమించి విచారణకు ఆదేశించారు. విచారణలో ఎస్ఐ, కానిస్టేబుళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలింది. దీంతో ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరియమ్మపై అడ్డగూడురు పీఎస్ పరిధిలోని గోవిందాపురం ప్రాంతంలో నివాసముంటున్న ఓ చర్చి ఫాదర్ ఇచ్చిన రూ.2 లక్షల చోరీ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.