సూర్యాపేట, జూలై 9(నమస్తే తెలంగాణ) : మృగశిర కార్తె నుంచే వ్యవసాయ పనులతో బిజీబిజీగా ఉండాల్సిన రైతన్న ఈ సారి తొలకరి జల్లుల అనంతరం సరిపడా వర్షాలు లేక కొంత ఆందోళనకు గురయ్యాడు. జూన్ నెలల్లో కొంతమేర వర్షాలు పడగా జూలై 6 వరకు చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. కాగా తొలకరి వర్షాలకు సాగు మొదలు పెట్టి విత్తనాలు వేశారు. జూలై 8 నాటికి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 89,462 ఎకరాలు, నల్లగొండలో 4.17లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈ ఏడాది వానకాలంలో సూర్యాపేట 6,02,734, నల్లగొండ 12,19,867 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా. ఆగస్టు చివరి నాటికి సాగు విస్తీర్ణం అంచనాలను చేరుకుంటుందన్నా అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. సూర్యాపేటలో దాదాపు 4 లక్షలు, నల్లగొండలో 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగు కానుండగా మిగిలిన భూముల్లో ఇతర పంటలు సాగు కానున్నాయి. మూడేండ్లుగా పుష్కలంగా వర్షాలు, నదుల నుంచి నీళ్లు వస్తుండడంతో ప్రస్తుతం భూగర్భ జలాలు పెరిగాయి. చెరువులు, బావులు, బోర్లలో నీరు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఒకవేళ రానున్న రోజుల్లో వర్షాలు పెద్దగా కురవకపోయినా పంటలకు కావాల్సిన నీళ్లు సరిపడా ఉన్నాయనే దీమాలో రైతాంగం ఉంది.
పెరుగుతున్న పత్తి, పప్పు ధాన్యాల సాగు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 6,02,734 ఎకరాలు, నల్లగొండలో 12లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయనే అంచనాలు ఉండగా వీటిలో దాదాపు 30 శాతం అంటే 1.80 లక్ష ఎకరాల్లో సూర్యాపేట జిల్లాలో పత్తి వేసే అవకాశాలు ఉంది. నల్లగొండలో సుమారు 70 శాతం అంటే 8 లక్షల ఎకరాల్లో పత్తి వేయనున్నట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో 89,462 ఎకరాల్లో పంటలు వేయగా వీటిలో 68,037 ఎకరాల్లో పత్తి వేశారు. అలాగే నల్లగొండ జిల్లాలో 4.17 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా 4.10 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. నాలుగు రోజులుగా భారీగానే పత్తి విత్తనాలు విత్తుతుండగా ఈ సారి పత్తి మరింతగా పెరిగే అవకాశం ఉంది. అలాగే సూర్యాపేటలో కంది ఈ సారి 55,000 ఎకరాల్లో సాగవుతుందనే అంచనాలు ఉండగా ఇప్పటి వరకు 5,534 ఎకరాలు, పెసర 12,867 సాగు అంచనా వేయగా ఇప్పటి వరకు 4,765 ఎకరాలు, మినుముల అంచనా 86 ఎకరాలకు ఇది భారీగా పెరిగి 216 ఎకరాలకు చేరింది. వీటితో పాటు 201 ఎకరాల్లో చెరుకు, వరి 27,342 ఎకరాల్లో నాట్లు పూర్తి కాగా ఇతర పంటలు ఇప్పటి వరకు 10,153 ఎకరాల్లో సాగు చేస్తున్నారని అధికారులు చెప్పారు. నల్లగొండ జిల్లాలో కంది ఈ సారి 50,000 ఎకరాల్లో సాగవుతుందనే అంచనాలు ఉండగా ఇప్పటి వరకు 4,251 ఎకరాలు, పెసర 1,060 సాగు అంచనా వేయగా ఇప్పటి వరకు 120 ఎకరాలు, వేరుశనగా 2000 ఎకరాల అంచనాకు 20 ఎకరాలతో పాటు ఇతర పంటలు కొంతమేర వేశారు.
ప్రారంభమైన వరి సాగు
జిల్లాలో అత్యధికంగా వరి సాగు అవుతుంది. జిల్లాలో ఈ వానకాలంలో 3,63,800లకు పైనే ఎకరాల్లో వరి పంట వేయనున్నట్లు అధికారులు అంచనాలు వేయగా ఇప్పటి వరకు 27,342 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. సాధారణంగా వరి నాట్లు జూలై రెండో వారం నుంచి ఆగస్టు చివరి వరకు వేస్తుండగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరి సాగును ప్రారంభించారు. నాగార్జునసాగర్లో సరిపడా నీళ్లు ఉండడంతో హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు వానకాలం వరి సాగుకు ఎలాంటి ఢోకా లేకపోగా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు, మూసీ నదులు ఉండడం పట్ల ఆ ఆయకట్టుకు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఇప్పుడిప్పుడే రైతులు వరి సాగుకు పనులు చేయడం ప్రారంభించారు.
ఆగస్టు చివరి వరకు నూరుశాతం
ప్రస్తుతం వరి నాటు జోరుగా సాగుతున్నాయి. దీనికి తోడు పత్తి, ఇతర పంటలు కూడా వేస్తున్నారు. కంది మినహా ఇతర పంటలు జిల్లాలో అనుకున్న లక్ష్యం మేరకు వేస్తారనే అంచనాలు ఉన్నాయి. అయితే వర్షాలు కాస్త ఆలస్యం కావడం వల్ల కందికి బదులు ఇతర పంటలు పెరిగే అవకాశం ఉంది.
-రామారావునాయక్, డీఏఓ, సూర్యాపేట