రవీంద్రభారతి, మార్చి 20 : వ్యవస్థలో బూజును దుళిపి రోగానికి మందు వేసి ప్రభుత్వానికి బాధ్యతలను గుర్తు చేయడమే అసలైన జర్నలిజమని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్రెడ్డి తన సంపాదకీయాలను ఆయుధంగా మలుచుకున్నారని, ఆయనను జర్నలిస్టులు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. సురవరం ప్రతాప్రెడ్డి 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు (టీయూడబ్ల్యూజే), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా (మోపి), తెలంగాణ సారస్వత పరిషత్ ప్రతాప్రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్టు ఆధ్వర్యంలో తెలుగు జాతి వికాసం, జర్నలిజం పాత్ర అనే అంశంపై శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు ప్రజాపక్షం సంపాదకులు కె. శ్రీనివాస్రెడ్డి సభాధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ సురవరం ప్రతాప్రెడ్డి ఒక వ్యక్తి కాదని, విభిన్న వ్యవస్థ అని కొనియాడారు. ప్రముఖ పాత్రికేయులు గోవిందరాజుల చక్రధర్, సాక్షి మేనేజింగ్ ఎడిటర్ ఆర్. దిలీప్రెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె. విరాసత్ అలీ పాల్గొన్నారు.