సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. దాదాపు రెండు వారాల నుంచి ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేపట్టగా అధికార టీఆర్ఎస్ పార్టీ మరోసారి ఐక్యతా చాటి తెలంగాణ ఆత్మను ఆవిష్కరించారు. అన్ని వర్గాలను ఏకం చేశారు. ముఖ్యమైన సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు స్వచ్ఛదంగా ముందుకు వచ్చి టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణీదేవికి మద్దతును ప్రకటించారు. తెలంగాణకు టీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని యావత్తు ప్రజానీకం ముక్తకంఠంతో చెబుతూ టీఆర్ఎస్ ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు.
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా క్యాంపెయిన్లో సత్తా చా టింది. పార్టీ శ్రేణులతో నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు.పలు సంఘాలు, ఉద్యోగులు, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ప్రతి 50 మంది ఓటర్లకు ఇన్చార్జితో పాటు నియోజకవర్గ ఇన్చార్జిలు, జిల్లాల ప్రజాప్రతినిధులతో నిత్యం ప్రచార సరళికి అనుగుణంగా వ్యూహాత్మకంగా ఇన్చార్జిలను మంత్రులు కమలాకర్, హరీశ్రావు పావులు కదిపారు.నిత్యం ప్రత్యేక వాట్సప్ గ్రూప్ల ద్వారా శ్రేణులను దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరు గడపను తట్టి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ వారిని పార్టీ వైపు ఆకర్షించారు.అభివృద్ధి మరిం త ముందు కు సాగాలంటే విద్యావేత్త, పీవీ కూతురు ఎస్.వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలంటూ ఓటర్లలో చైతన్యాన్ని తీసుకువచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుంటామని ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్లు చెబుతున్నారు.
శుక్రవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత అభ్యర్థులు, వారి అనుచరులు, బంధువులు కంప్యూటర్ల ముందు వాలిపోయేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సోషల్ నెట్వర్కింగ్ ద్వారా కొందరు అభ్యర్థులు ప్రచారం చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకాలం సన్నాహక సమావేశాలు, ఆత్మీయ సమావేశాలతో ఓటు బ్యాంకును ఆకట్టుకున్న అభ్యర్థులు ఇక పరిమిత సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓటు తమ పార్టీ అభ్యర్థికే వేయాలని ఓటర్లను అభ్యర్థించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులు తాము పోటీ చేసే ప్రాంతంతో పాటు తమ పార్టీ గురించి కూడా సోషల్ నెట్వర్క్ సైట్లలో పొందుపరుస్తున్నారు. డివిజన్ల వారీగా ఉన్న ఓట్లలో ఎక్కువ ప్రాబల్యం కలిగిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటున్న అభ్యర్థులు ఆయా సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. గెలుపోటములపై ప్రభావం ఉండే పోలింగ్ బూత్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది.