రోడ్డు పక్కన చెత్త అనేదే లేకుండాపోయింది. ఆ చెత్తంతా సేంద్రియ ఎరువుగా మారింది. రహదారులన్నీ సీసీ రోైడ్లెనయ్. రోడ్డు మీది మురుగు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోకి పోయింది. నర్సరీల మొక్కలు ఊరంతా చేరినయ్. ఊర్లన్నీ హరిత వనాలుగా రూపుదిద్దుకొన్నాయి. వీధులకు ఎల్ఈడీ కాంతులు వచ్చినయ్. ఒక్కమాటలో చెప్పాలంటే పల్లెలన్నీ పచ్చగా మారాయి. పట్నాలన్నీ పరిశుభ్రంగా కనిపించాయి. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఈ నెల 1న ప్రారంభం కాగా, రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలు, పట్టణాలు అందంగా ముస్తాబయ్యాయి. పదిరోజుల పాటు నిర్విరామంగా సాగిన ప్రగతి యజ్ఞం శనివారం నాటికి దిగ్విజయంగా ముగిసింది.
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): పల్లెలు, పట్టణాలను బాగుచేసేందుకు రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం, పల్లె ప్రకృతివనాల ఏర్పాటు, వైకుంఠధామాలు నిర్మాణం, వాడల్లో సీసీ రోడ్ల నిర్మాణం, చెత్త తొలగింపు.. వంటి పనులన్నీ పది రోజుల పాటు నిరాటంకంగా కొనసాగాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దిశానిర్దేశనంలో గ్రామ సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రుల వరకు, గ్రామ కార్యదర్శి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిచ్చారు. ఎక్కడికక్కడ పెద్దఎత్తున మొక్కలు నాటారు. విద్యుత్తు వ్యవస్థను మెరుగుపర్చారు.
పట్టణ ప్రగతిలో భాగంగా 44.50 లక్షల మొక్కలను ఇంటింటికి పంపిణీ చేశారు. 14.66 లక్షల మొక్కలను పట్టణాలు, నగరాల్లో నాటారు. 1.27 లక్షల మీటర్ల మేర రోడ్లమధ్యలో మొక్కలను నాటారు. 7,193 కిలోమీటర్లలో రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటారు. 78వేల మీటర్ల పరిధిలో వేలాడుతున్న విద్యుత్తువైర్లను సరిచేశారు. 2,161 తుప్పు పట్టిన విద్యుత్తుస్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేశారు. 31,061 టన్నుల చెత్తను ఎత్తిపోశారు. 13,246 కిలోమీటర్ల మురుగు కాలువల్లో పూడిక, చెత్త, వ్యర్థాలను తొలగించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి కార్యక్రమ ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో భాగస్వాములయ్యేవిధంగా చైతన్యం తీసుకొచ్చారు. దీంతో ప్రతిగ్రామంలో ప్రజలు పెద్దఎత్తున పల్లె ప్రగతిలో పాలుపంచుకొన్నారు. వర్షపు నీరు, మురుగు సులువుగా వెళ్లేలా కాలువలను శుభ్రం చేశారు. దోమలు వ్యాపించకుండా పెద్దఎత్తున ఫాగింగ్ చేశారు. ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. నీటి సరఫరా చేసే వాటర్ ట్యాంకులను శుభ్రం చేశారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేశారు. ఇక, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అమలులో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది, ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్లు షోకాజ్ నోటీసులు జారీచేశారు. మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో గ్రామ, మండలస్థాయి అధికారులకు నోటీసులు జారీఅయ్యాయి.
హరితహారానికి రూ.1,193.87 కోట్లు
తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి ప్రభుత్వం రూ.1,193.87 కోట్లు వెచ్చించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 217 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ప్రతి వాడ, గ్రామం, ప్రభుత్వ సంస్థలు, రోడ్ల వెంబడి, కొత్త పార్కుల ఏర్పాటు ఇలా రాష్ర్టాన్ని ప్రభుత్వం హరితవనంగా మార్చుతున్నది.
అధికారుల జిల్లాల బాట
పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిలో అధికారులు కూడా క్షేత్రస్థాయిలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, మున్సిపల్శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘనందన్రావు, సీఎంవో కార్యదర్శి స్మితసబర్వాల్, సీఎంవో ఓఎస్డీ ప్రియాంకవర్గీస్ వివిధ జిల్లాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి రూ.8,616 కోట్లు
రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి చేపట్టినప్పటి నుంచి ఈ రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం రూ.8,616 కోట్లు ఖర్చు చేసింది. పల్లె ప్రగతికి రూ.6,657 కోట్లు, పట్టణ ప్రగతికి రూ.1,959 కోట్లు కేటాయించింది. పల్లె ప్రగతి నాలుగు విడతలుగా, పట్టణ ప్రగతి మూడు విడతలుగా జరిగింది. గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వం మౌలిక వసతులను కల్పించింది. పల్లె ప్రగతి నిధులను గ్రామాల్లో ట్రాక్టరు కొనుగోలు, వైకుంఠధామాల నిర్మాణం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, ఇతర మౌలిక వసతుల కోసం ఖర్చు చేశారు. దీంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పట్టణ ప్రగతి నిధుల ద్వారా పట్టణాలు, నగరాలు పరిశుభ్రంగా మారాయి. చెత్త ఏరివేత, విద్యుత్తు స్తంభాల మరమ్మతులు, కొత్తవాటిని అమర్చటం వంటి పనులు జరిగాయి.
ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు
పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. కార్యక్రమంలో అన్ని స్థాయిల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు. పల్లెప్రగతి పూర్తయినా గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలి. వర్షకాలం నేపథ్యంలో పల్లె ప్రగతి ద్వారా పారిశుద్ధ్యానికి పెద్దఎత్తున ప్రాధాన్యం ఇచ్చాం. అత్యధిక జిల్లాల్లో నేనే స్వయంగా పర్యటించి, పల్లె ప్రగతిలో పాల్గొన్నా. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారు.