సిటీబ్యూరో, అగస్టు 15(నమస్తే తెలంగాణ): సన్పవర్ మల్టీలెవల్ మార్కెటింగ్ మోసానికి సంబంధించిన రూ. 14 కోట్ల నగదు చోరీ చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సన్పవర్ మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ లక్ష పెట్టుబడికి 72 శాతం వడ్డీ కింద 25 నెలల తర్వాత ఐదు లక్షలు చెల్లిస్తామని సుమారు 1400 మందిని నిండా ముంచింది. వారి దగ్గర నుంచి సుమారు రూ.158 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కొంత నగదుతో పాటు బ్యాంకుల్లో ఉన్న డబ్బును పోలీసులు ఫ్రీజ్ చేశారు. సంస్థ సీఈవో రవీందర్ తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో రవీందర్ రూ. 14 కోట్ల నగదును దాచిపెట్టిన విషయం పోలీసులకు తెలియకుండా గోప్యంగా ఉంచాడు. ఆ డబ్బులను తస్కరించిన ఖైరతాబాద్కు చెందిన నరేశ్, అతని భార్య అనురాధ, కొడుకు అభిజిత్, కూతురు నితిషాను రెండు రోజుల కిందట అరెస్ట్ చేశారు. నిందితుల విచారణలో నితిషా భర్త శ్రీకాంత్, అతడి తండ్రి దేవానందం పేర్లు కూడా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో శ్రీకాంత్, దేవానందంలపై కూడా కేసు నమోదు చేశారు. దేవానందం ప్రస్తుతం అమీన్పూర్ ఎంపీపీగా, నితిషా పటేల్గూడ సర్పంచ్గా ఉన్నారు. దేవానందం, శ్రీకాంత్ పరారీలో ఉన్నారు. బాధితుల నుంచి దోచుకున్న డబ్బును దాచిపెట్టినందుకు సన్వపర్ సంస్థ సీఈవో రవీందర్, ప్రతినిధి శంకర్ల పై కూడా పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.