సిటీబ్యూరో, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): నగర ప్రజలు ట్యాంక్బండ్పై ఆహ్లాదకరమైన వాతావారణంలో గడిపేందుకు ఆదివారం నుంచి ట్రాఫిక్ ఆంక్షల సమయాన్ని పెంచుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్బండ్పైకి వాహనాల రాకపోకలు నిషేధిస్తూ, ఆ సమయంలో కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. గత నెలలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ట్విట్టర్లో నగర పౌరుడి కోరిక మేరకు గత నెల 29వ తేదీ నుంచి ట్యాంక్బండ్పై సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే.
ఈ అవకాశం కల్పించడంతో ట్యాంక్బండ్పైకి ఆదివారం సాయంత్రం వేళల్లో నగర ప్రజలు భారీగా వస్తున్నారు. దీంతో ప్రజలకు మరింత సమయం ట్యాంక్బండ్పై గడిపేందుకు, వారికి వెసులుబాటు కల్పించేందుకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చర్చించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటం, ఆదివారం పగటి వేళల్లో కూడా మరింత సమయం ట్యాంక్బండ్పై గడిపేందుకు అవకాశముంటుందని, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు కొద్దిసేపు ట్యాంక్బండ్ పరిసరాలలో గడిపేందుకు సమయం కలిసి వస్తుందని అధికారులు భావించారు.
దీంతో వచ్చే ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్యాంక్బండ్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. దీంతో ట్రాఫిక్ విభాగం అధికారులు ట్యాంక్బండ్ సందర్శనకు వచ్చే వారి కోసం మూడు గంటల నుంచి సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా, అందుకు తగ్గట్టుగా చర్యలు ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను లేపాక్షి వరకు, రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వారు చిల్డ్రన్ పార్కు వరకు, ట్యాంక్బండ్కు ఇరువైపుల పార్కింగ్ చేసుకునే విధంగా ఇప్పటికే పార్కింగ్ స్థలాలను కేటాయించిన విషయం తెలిసిందే. సాధారణ వాహనదారులు ఆదివారం మూడు గంటల నుంచి ట్యాంక్బండ్కు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.