సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఎండల తీవ్రతకు క్రమంగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఫిబ్రవరి ముగిసి మార్చిలోకి రాగానే ఎండలు మండుతుండటంతో విద్యుత్ వాడకం 50 మిలియన్ల యూనిట్ల నుంచి 52 మిలియన్ల యూనిట్లకు చేరింది. ప్రతి సంవత్సరం వేసవిలో కొత్తగా పెరిగే కనెక్షన్లతో పాటు విద్యుత్ వాడకం అధికంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రతిరోజు పీక్ అవర్ డిమాండ్ 2000 మెగావాట్ల వరకు ఉండగా.. ఏప్రిల్, మేలో 3500 మెగావాట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు గ్రేటర్ జోన్ పరిధిలోని తొమ్మిది సర్కిళ్లలో అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు.
లాక్డౌన్ తర్వాత అన్ని వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, మెట్రో, రైల్వే, ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను యథావిథిగా నిర్వహిస్తున్నాయి. దీంతో ఈ వేసవిలో విద్యుత్ వినియోగం బాగా పెరుగుతుందన్న అంచనాతో అధికారులు ఉన్నారు. మార్చి నెల ప్రారంభంలోనే 50 మిలియన్ల యూనిట్లు నమోదు కాగా ఈ నెల చివరి నాటికి 60, ఏప్రిల్, మే నెలల్లో అది 75 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.