కందుకూరు : ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రంగారెడ్డి జిల్లా అన్నోజిగూడ గ్రామానికి చెందిన నీలం రాములు కుటుంబాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.
శనివారం రాత్రి మంత్రి గ్రామానికి వచ్చి రాములు భార్య సువర్ణ, కుమారుడు సురేష్, కుమార్తెలు అఖీల, శిరీషలను పరామర్శించి వారిని ఓదార్చారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఫార్మాసిటీలో భూమి కోల్పోయమని నష్టపరిహారం రావడం లేదని,ధరణి పోర్టల్లో కొనుగోలు చేసిన భూమి రిజిష్టేషన్ కావడం లేదని వారు మంత్రికి వివరించారు.
దీంతో మంత్రి మాట్లాడుతూ, ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని, దశల వారీగా రైతులకు ప్రభుత్వ న్యాయం చేస్తుందని తెలిపారు. చిన్న సమస్యను పెద్దదిగా చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని కుటుంబ సభ్యులకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. సమస్యను పరిష్కరించాలని తాసీల్దారు జ్యోతిని ఆదేశించారు.
రాములు పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తామని వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. భవిష్యత్లో రైతులకు అన్యాయం జరుగకుండా మంత్రుల కమిటీ వేసినట్లు వివరించారు.ధరణిలో వస్తున్న మార్పుల విషయాన్ని గ్రామాల్లో దండోర వేయించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
ఆత్మహత్యలు లేని తెలంగాణ ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.ఫార్మాలో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామన్నారు. అనంతరం మంత్రి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహయం చేశారు.
మంత్రి వెంట సర్పంచ్ కాకి ఇందిరమ్మ, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటి చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నే జయేందర్ ముదిరాజ్ ఉన్నారు.