బంజారాహిల్స్,సెప్టెంబర్ 7: ‘మనశ్శాంతికోసం వెతుకుతున్నా..చావొక్కటే దానికి మార్గమంటూ..’ ఓ యువకుడు వాట్సప్ స్టేటస్లో వీడియో పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హకీంపేటలోని ఫాతిమా కాలనీలో నివాసం ఉంటున్న ఇక్బాల్ ఉస్మానీ(28) బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
తండ్రి పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో తల్లి మహబూబ్ ఆథర్తో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే చాలాకాలంగా ఉద్యోగం లేకపోవడంతో పాటు తల్లి అనారోగ్యంతో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. దాంతో మనస్థాపానికి గురైన ఇక్బాల్ ఉస్మానీ సోమవారం సాయంత్రం తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని గంట తర్వాత గమనించిన తల్లి మహబూబ్ అథర్ స్థానికుల సాయంతో దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తేలింది. మృతుడి మొబైల్ఫోన్లో స్టేటస్ను పరిశీలించగా తాను మనశ్శాంతి కోసం వెతుక్కుంటున్నానని, చావొక్కటే మనశ్శాంతి ఇస్తుందంటూ వీడియో సందేశం పెట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.