మానవత్వం మంటగలిసి పోతున్నది. నూరేండ్లు కలిసి ఉండాల్సిన బంధానికి విలువలేకుండా పోయింది. వేధింపుల సుడిగుండంలో చిక్కుకొని సంసారమనే సాగరం ఈదలేక అర్ధాంతరంగా జీవితానికి ముగింపు పలుకుతున్న అబలల వరుస ఉదంతాలు సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. అందులోనూ.. జీవితంలో సగ భాగమైన అర్ధాంగిని కండ్లముందే బలవన్మరణంతో తనువు చాలిస్తున్నా.. అడ్డుకోవాల్సిన భర్తలు పాశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. అగ్నిసాక్షిగా ఒక్కటైన వివాహ బంధానికి అర్థం లేకుండా చేస్తున్నారు.
మొన్న కండ్లముందే భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటూ ఉండగా భర్త వీడియోతీస్తూ పైశాచిక ఆనందాన్ని పొందిన సంఘటన మరువక ముందే ఎంఎం పహాడ్లో మరో సంఘటన చోటు చేసుకుంది. తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన పిల్లలు దవాఖానకు తరలించే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకుని గదిలో వేసి బంధించిన తండ్రి కండ్లముందే తల్లడిల్లుతున్న తన భార్యను చూస్తూ పైశాచిక ఆనందం పొందాడు. పిల్లల అరుపులు, కేకలు విన్న స్థానికులు వచ్చేలోపే ఆ తల్లి మృత్యుఒడికి చేరింది.
బండ్లగూడ, సెప్టెంబర్ 23 : భర్త వేధింపులు తాళలేక భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడ్కు చెందిన మహ్మద్సాజిద్, సబీనాబేగం దంపతులు. వీరికి ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. టెంట్ హౌజ్లో పనిచేస్తున్న సాజిద్ మద్యంకు బానిసై భార్యా, పిల్లలను వేధిస్తున్నాడు. దీంతో భార్య సబీనా బేగం(35) బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన పిల్లలు దవాఖానకు తరలించేందుకు ప్రయత్నించగా తండ్రి సాజిద్ వారిని గదిలో బంధించాడు. పరిస్థితి విషమించడంతో సబీనా అక్కడికక్కడే మృతి చెందింది. సాయంత్రం సమయంలో పిల్లల అరుపులు విని స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా సబీనాబేగం మృతిచెంది ఉంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.