వెంగళరావునగర్, జూన్ 6 : ఆడపిల్లలు కన్నావని భర్త పెట్టే వేధింపులు భరించలేక.. మనస్తాపానికి గురైన గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలానికి చెందిన రమావత్ లింగం కూతురు అనిత(25)తో గుంటూరు జిల్లా రేగులవార తండాకు చెందిన వి.బాబూరావుతో 2015లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. బతుకుదెరువు కోసం దంపతులు రెండు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి బోరబండ సమీపంలోని ఇందిరానగర్ ఫేజ్-2లో నివాసం ఉంటున్నారు. కూలీగా పనిచేస్తున్నారు.. కాగా.. బాబూరావు కొంత కాలంగా భార్యను వేధించడం మొదలు పెట్టాడు.
మద్యం తాగి వచ్చి ఆడపిల్లలను కన్నావని దూషిస్తూ, వేధింపులకు గురిచేసేవాడు. బాధితురాలు అనిత… భర్త వేధింపులను తల్లిదండ్రులకు చెప్పగా.. త్వరలో నగరానికి వచ్చి మాట్లాడుతామని చెప్పారు.. మళ్లీ శనివారం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏడ్చి.. ఫోన్ కట్ చేసింది. అనంతరం ఆత్మహత్య చేసుకున్నది. ఆదివారం ఉదయం నగరంలో ఉండే బంధువుల ద్వారా సమాచారం అం దుకున్న అనిత తల్లిదండ్రులు నగరానికి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అల్లుడు పెట్టే వేధింపులు భరించలేక తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని అనిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.