హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రజక, నాయీబ్రాహ్మణులకు సంబంధించిన క్షౌరశాలలు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు అందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలుచేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. రజక, నాయీబ్రాహ్మణ సంఘాలు ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రం మొత్తానికి ఈ నిర్ణయం వర్తింపజేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న క్షౌర శాలలకు (కటింగ్ షాపులు), లాండ్రీలు, దోబీఘాట్లకు నెలకు 250 యూనిట్లవరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇస్తూ తక్షణం జీవో జారీకి చర్యలు తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి భూపాల్రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అత్యంత బలహీనవర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, వారికోసం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని సీఎం తెలిపారు.
సాంకేతికాభివృద్ధి కారణంగా రజకులు, నాయీబ్రాహ్మణులు కులవృత్తి నిర్వహణలో పలురకాల యంత్రాలు వాడుతున్నారు. ఇకనుంచి ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందిస్తుండటంతో వీరికి శారీరక శ్రమ తగ్గి, ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. సీఎం ఆదేశాలమేరకు బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆదివారం జీవో విడుదలచేశారు. ఈ నెల 1వ తేదీనుంచే ఉచిత విద్యుత్ సరఫరా అమల్లోకి వస్తుందని జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామస్థాయి నుంచి జీహెచ్ఎంసీ వరకు కులవృత్తిలో ఉన్న నాలుగున్నర లక్షలమంది రజకులకు, రెండున్నర లక్షలమంది నాయీబ్రాహ్మణులకు ప్రయోజనం కలుగుతుంది. ఉచిత విద్యుత్ వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.250 కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు అంచనావేశారు. ఈ నెల నుంచి రాష్ట్రంలో నెలకు 250 యూనిట్లవరకు విద్యుత్తు వాడే క్షవరశాలలు, లాండ్రీలు, దోబీఘాట్ల యజమానులు బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందనున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై రజకులు, నాయీబ్రాహ్మణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఇవీ కూడా చదవండి…