వాషింగ్టన్: మంగోలియా, షీషెల్స్, బహ్రాన్ లాంటి దేశాల్లో చైనా వ్యాక్సిన్లను పంపిణీ చేశారు. కానీ ఇప్పుడు ఆ దేశాల్లో మళ్లీ వైరస్ కేసులు విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ను సంపూర్ణంగా నియంత్రించడంలో చైనా వ్యాక్సిన్లు విఫలమైనట్లు అనేక దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా తెలుస్తున్నట్లు ఇటీవల న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నది. చైనా టీకాలు ముఖ్యంగా కొత్త వేరియంట్లపై అసలు పనిచేయడం లేదని ఆ రిపోర్ట్లో తెలిపారు. షీషెల్స్, చిలీ, బహ్రాన్, మంగోలియా దేశాల్లో 50 నుంచి 68 శాతం వరకు టీకాలు ఇచ్చేశారు. ఒకవేళ వ్యాక్సిన్లు మంచివే అయితే, అప్పుడు కేసులు ఇలా పెరగకూడదని హాంగ్కాంగ్ వర్సిటీ వైరాలజిస్ట్ జిన్ డాంగ్యాన్ తెలిపారు.
చైనాకు చెందిన సైనోఫార్మ్ వ్యాక్సిన్కు 78.1 శాతం సామర్థ్యం ఉన్నది. ఇక సైనోవాక్ టీకాకు 51 శాతం సామర్థ్యం ఉన్నట్లు తేల్చారు. చైనా టీకాలను సుమారు 90 దేశాలు వేసుకుంటున్నాయి. డ్రాగన్ టీకాలు తీసుకున్న మంగోలియాలో గత ఆదివారం కొత్తగా 2400 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వ్యాక్సిన్లకు.. మళ్లీ కేసులు పెరగడానికి సంబంధం లేదని చైనా విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొన్నది. మహమ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కనీస స్థాయికి చేరాలని డబ్ల్యూహెచ్వో చెప్పినట్లు ఆ దేశం వెల్లడించింది.
కేసుల సంఖ్య మళ్లీ పెరిగిన షీషెల్స్, మంగోలియా దేశాలు మాత్రం సైనోఫామ్ టీకా బాగున్నట్లు చెబుతున్నాయి. ఇక ఇండోనేషియాలో కొత్త వేరియంట్ వ్యాపిస్తున్నది. అక్కడ సైనోవాక్ టీకా తీసుకున్న 350 మంది డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు మళ్లీ పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తున్నది. బెహ్రాన్, యూఏఈ దేశాల్లో సైనోఫార్మ్ టీకా తీసుకున్నవారు మళ్లీ అనారోగ్యానికి గురవుతున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది.