జీడిమెట్ల/ కుత్బుల్లాపూర్, జూన్ 9 : సేవ చేయాలనే తపన కొందరిలోనే ఉంటుంది.. ఇక మూగజీవాల కడుపు నింపాలన్న గొప్ప మనసు ఉన్నవాళ్లు చాలా అరుదే. ఆ కోవలోకే వచ్చే కాకర్ల రాధ వీధికుక్కల కడుపునింపుతున్నారు. సొసైటీ అంటే మనుషులు మాత్రమే కాదు.. జంతువులు, వృక్షాలు కూడా అని అంటున్న ఆమె.. ఒకవైపు సివిల్స్కు సిద్ధమవుతూనే.. ప్రకృతిపై ప్రేమతో ధరణి గ్రీన్ సొల్యూషన్స్ సంస్థను(ల్యాండ్ స్కేపింగ్, గార్డెనింగ్ సర్వీసెస్) స్థాపించి.. మొక్కలు పెంచడంతో పాటు మూగజీవాలను సైతం కాపాడుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులతో పాటు వీధి కుక్కలకు ఆహారాన్ని అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ వేంకటేశ్వరకాలనీకి చెందిన కాకర్ల రాధ భర్త మరణించగా, ఇద్దరు పిల్లలు శ్రేయాష్, శ్రేష్టలను పోషించుకుంటూనే.. సమాజ సేవకు అంకితమయ్యారు. తన తండ్రి, విశ్రాంత ఆర్మీ ఉద్యోగి అయిన కాకర్ల వెంకటేశ్వర్లును ఆదర్శంగా తీసుకొని.. అంతరించిపోతున్న ప్రకృతిని మనం కాపాడుకుంటేనే.. రానున్న తరాలకు భవిష్యత్ ఉంటుందని తెలియజేస్తూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు రాధ.
లాక్డౌన్ సమయంలో పలు సంస్థలు అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాయి. అయితే మూగజీవాల పరిస్థితి మాత్రం దయనీయంగా మారాయి. ఈ నేపథ్యంలో తనకు సాధ్యమైనంత వరకు వాటి ఆకలి తీర్చాలని నిర్ణయానికి వచ్చిన రాధ.. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వీధి కుక్కలకు అన్నం పెడుతూ కడుపునింపుతున్నారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రతి రోజూ.. వీధివీధిన తిరుగుతూ.. వందలాది కుక్కలకు (సుమారు 300 పై చిలుకు) ఆహారం అందిస్తున్నారు. మధ్యాహ్నం అయితే చాలు.. ఆమె తీసుకొచ్చే ఆహారం కోసం శునకాలు విశ్వాసంతో ఎదురు చూస్తుండటం విశేషం. ప్రతి రోజూ 30 కిలోల బియ్యం, 120 నుంచి 150 వరకు గుడ్లు, 10 నుంచి 15 కిలోల చికెన్ వండుతున్నట్లు రాధ పేర్కొన్నారు. రోజుకు ఐదువేల పై చిలుకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఎగ్, చికెన్ బిర్యానీ మిక్స్ చేసి.. బకెట్లలో నింపుకుని ఉదయం 11.30 గంటల సమయంలో ప్రతి కాలనీ తిరుగుతూ.. వీధి కుక్కలు కనిపించిన చోటల్లా.. తిండి పెడుతున్నారు. ఎవరైనా 8790315763 నంబర్కు కాల్ చేస్తే.. వీధి కుక్కలకు ఆహారం అందిస్తామని ఆమె చెబుతున్నారు.
మొన్నటివరకు వీధి కుక్కల ఆకలి మాత్రమే తీర్చిన రాథ.. తాజాగా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు సైతం ముందుకు కదిలారు. రోడ్లవెంట తిరుగుతూ ఆకలితో అలమటిస్తున్న ఫుట్పాత్ నివాసితులు, అన్నార్తులకు బిర్యాని బాక్సులను అందజేస్తున్నారు. ప్రతి రోజు సుమారు 200 నుంచి 300 మందికి కడుపునిండా భోజనం పెడుతూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. ప్రతిరోజూ నిరుపేదల ఆకలి తీర్చేందుకు 50 కిలోల బియ్యం, 300 గుడ్లు వండుతూ.. బాక్సుల్లో ప్యాక్ చేసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
నా కుమారుడు ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు, శునకాలకు ఆహారం పెడదామని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నా. మా చెల్లెలు శ్రవంతి, తమ్ముడు వెంకటేశ్ సహాయంతో వీధుల్లో తిరుగుతూ.. కుక్కలకు తిండిపెడుతున్నాం. ప్రతి రోజు మా బండి ఆపగానే అవి దగ్గరకు పరుగెత్తుకుంటూ వస్తుంటే.. మనసుకు సంతోషంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సేవ చేసేందుకు ముందుకురావాలి. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవాలి. -కాకర్ల రాధ, మేనేజింగ్ డైరెక్టర్, ధరణి గ్రీన్ సొల్యూషన్స్