సిటీబ్యూరో, మార్చి18 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల దేశవ్యాప్తంగా ప్రజల ఆదాయాల్లో అసమానతలు పెరిగిపోతున్నాయని, వాటి పరిష్కారానికి రాజకీయపార్టీలు, మేధావులు ఆలోచనలు చేయాల్సిన అవసరముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘భారతదేశంలో పెరిగిపోతున్న ఆదాయ అసమానతలు- సామాజిక, రాజకీయ కారకాల పాత్ర’ అనే అంశంపై సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) వ్యవస్థాపక సభ్యులు, ఆచార్య సీహెచ్ హనుమంతరావు రచించిన పరిశోధనాత్మక పత్రాన్ని వెలువరించారు. దీనిపై సెస్లోని బీపీఆర్ ఆడిటోరియంలో గురువారం మేధావులు, వివిధ పార్టీల నేతలు, సామాజిక వేత్తలతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహించగా, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావుతో కలిసి వినోద్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ ఆచార్య సీహెచ్ హనుమంతరావు చేసిన పరిశోధనను కొనియాడారు. ప్రస్తుతం దేశంలో ఒక విధమైన విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని, పేదల ఆదాయాలు పడిపోతుండగా, ధనికుల ఆదాయాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మేధావులు చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు ఇలాంటి చర్చ కార్యక్రమాలను నిర్వహించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, యువతకు మార్గదర్శకం చేయాలని పిలుపునిచ్చారు. ఒకనాడు మేధావులు నిర్వహించిన ఇలాంటి చర్చల వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని, ప్రస్తుతం అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియాడారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నదని తెలిపారు. జాతీయ రాజకీయాల్లోనూ ప్రత్యామ్నాయం దిశగా ఆలోచించాల్సిన అవసరముందని, ఆ దిశగా మేధావులు, రాజకీయ నేతలు కృషి చేయాలని, యువతను ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు పలువురు వక్తలు మాట్లాడుతూ దేశంలోని పేదల పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా వారి జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పు లు చోటుచేసుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే పార్టీలు వేరై నా, అవి అనుసరిస్తున్న అభివృద్ధి విధానాలు ఒక్కటేనన్నా రు. అందువల్లే ఉన్నత ఆదాయ వర్గాలు, అల్ప-మధ్యతరగతి ఆదాయ వర్గాల మధ్య అంతరాలు నానాటికీ పెరిగిపోతున్నాయన్నారు.ఇకనైనా రాజకీయ పార్టీలు అల్పాదాయ వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా సాధికారికుల్ని చేసే అంశంపై దృష్టి సారించాలని, అందుకు భావసారూప్యమున్న పార్టీలు ముందుకు వచ్చి ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానాలను అమలుచేసే దిశగా ఆలోచనలు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చర్చ కార్యక్రమం సెస్ డైరెక్టర్, ప్రొఫెసర్ రేవతి ఆధ్వర్యంలో కొనసాగగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ, సీపీఎం నాయకులు మధు, కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చుల్ సెల్ చైర్మన్ శ్యాంమోహన్, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి, విశ్రాంత ఆ చార్యులు డీ.నర్సింహారెడ్డి, రమా, శ్రీనివాసులు, పురేంద్రప్రసాద్, సోషియో,రీసెర్చ్స్కాలర్లు పాల్గొన్నారు.