శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఈ లైబ్రరీలో 150 ఏండ్ల కిందటి అరుదైన పుస్తకాలు ఉన్నాయి. పుస్తక ప్రియులకు పరిచయం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనలో అపురూప గ్రంథాలను ఉంచాం. పురాతన పుస్తకాల సమాచారం కోసం వెబ్సైట్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి పుస్తకాన్ని డిజిటలైజేషన్ కూడా చేస్తున్నాం. ప్రతి రోజు వెయ్యి మంది ఈ లైబ్రరీని సందర్శిస్తారు. అన్ని భాషలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. పీహెచ్డీ, ఇతర పరిశోధన విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. – టీజీవీ రాణి, గెజిటెడ్
లైబ్రేరియన్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ
తెలుగు ప్రాచీన పుస్తకాలు ఎన్నో.. అందులో 1905లో వెలువరించిన అభినయ దర్పణం, 1907లోని శ్రీ మహేంద్ర విజయం, 1890కి చెందిన వైశ్యధర్మప్రకాశికం, 1934కు చెందిన రామావతార తత్వం, 1926కు సంబంధించిన శ్రీకృష్ణావతార తత్వం, 1930లోని కళా పూర్ణోదయం
లాంటి అతి పురాతన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి.
సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): అతి పురాతన గ్రంథాలయాల్లో ఒకటైన అఫ్జల్గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది. అత్యంత పురాతన పుస్తకాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నది. 130 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ లైబ్రరీలో మొత్తంగా 5.50 లక్షల పుస్తకాలున్నాయి. అత్యంత విలువైన పుస్తకాలను సేకరించిన నిజాం నవాబు స్వయంగా గ్రంథాయాన్ని ఏర్పాటు చేశారు. వందేండ్ల క్రితం ఈ గ్రంథాలయానికి ప్రత్యేకంగా భవనం నిర్మించడం విశేషం. ప్రపంచ దేశాల్లో సైతం లభించని అరుదైన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నేటికీ విదేశాలకు చెందిన పరిశోధకులు, శాస్త్రజ్ఞులు, అధ్యయనశీలురు ఇక్కడికి వచ్చి కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తారు.
75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కోల్కతా రాజారామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ సాయంతో సెంట్రల్ లైబ్రరీలో 17, 18వ శతాబ్దానికి చెందిన పుస్తకాలను ప్రదర్శనకు పెట్టారు. నిజాం కాలం నాటి నుంచి నేటి వరకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, అరబిక్, కన్నడ, పర్షియన్ భాషల పుస్తకాలు, పత్రికలతో పాటు ఇరాన్, ఇరాక్, అమెరికా, ఇటలీ నుంచి సేకరించిన పలు గ్రంథాలను ప్రదర్శించారు.
అంతేకాకుండా నేటి తరానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో 1977 వరకు ఉన్న సుమారు 45,700 అతి పురాతన పుస్తకాలు, వార్తా పత్రికలను డిజిటలైజేషన్ చేసి గ్రంథాలయంలో అందరికీ అందుబాటులో ఉంచడం మరో విశేషం. ఈ నెల 15 వరకు కొనసాగనున్న పుస్తక ప్రదర్శనకు పుస్తక ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. తొలి ఉర్దూ ఖురాన్, ఉర్దూలోని భగవద్గీత, రామయణ చరిత్రతోపాటు 1902 నాటి తొలి ఆంధ్ర పత్రిక, 1947కు ముందు జరిగిన ఉద్యమాల చరిత్రకు సంబంధించిన గ్రంథాలు, పత్రికలను ఈ ప్రదర్శనలో ఉంచారు.