కాచిగూడ,ఆగస్టు 15 : పేద ప్రజలు ఉచిత వైద్య, యోగా శిబిరాలను సద్వినియోగం చేసుకుని, ఆరోగ్య పరమైన సమస్యలను దూరం చేసుకోవాలని హర్రస్పెంట శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎస్.గోపాల్రావు అన్నారు. ప్రజలకు, భక్తులకు అందుబాటులో ఉండేందుకు హర్రస్పెంటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో స్వాతంత్రదినోత్సవం సందర్భంగా 5 వేల చదరపు గజాలతో నిర్మించిన ఉచిత ఫిజియెధెరఫి, వైద్యశిబిరం, యోగా శిబిరం, ఆధ్యాత్మిక పుస్తకాలతో ముస్తాబైన రీడింగ్ రూమ్ను ఆదివారం గోపాల్రావు, కమిటీ ప్రతినిధులు ప్రారంభించారు.
ఈ వైద్య శిబిరంలో ప్రతిరోజు డాక్టర్లు ఉదయం 9 గంటల నుంచి 1 వరకు అందుబాటులో ఉంటారన్నారు. పేద ప్రజలు పాల్గొని ఆరోగ్య పరమైన ఈసీజీ, బ్లడ్ షుగర్ తదితర ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. పలు రకాల వ్యాధులను రూపుమాపడానికి ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో దోహద పడుతాయన్నారు.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయంలో సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ వర్కింగ్ ప్రసిడెంట్ రాజ్కుమార్ విగ్, ప్రధాన కార్యదర్శి వీరస్వామి, సభ్యులు సత్యనారాయణ, బి.కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.