రవీంద్రభారతి, సెప్టెంబర్ 3 : శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్వెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో శ్రుతిలయ ఆర్ట్స్ 20వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర గుప్తా, పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా విచ్చేశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. శ్రుతిలయ ఆర్డ్స్ సంస్థ అధ్యక్షురాలిగా గుడ్లు ధనలక్ష్మి బాధ్యతలు చేపట్టడం సంతోషదాయకం అన్నారు.
సంస్థ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి ప్రముఖలను సన్మానించడం అభినందనీయమన్నారు. 50 ఏండ్లలో మానవ సంబంధాల గురించి ఘంటశాల మాస్టారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన మధుర గీతాలలో మానవీయ సంబంధాలున్నాయన్నారు. నిజంగా ఇలాంటి పాటలు ఇంటే మనసు ఉల్లాసంగా ఉంటుందన్నారు. ఇలాంటి గొప్పవాళ్లను సన్మానించడం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారన్నారు. శ్రుతిలయ ఆర్డ్స్ అకాడమీ అధ్యక్షురాలిగా గుడ్ల ధనలక్ష్మి బాధ్యతలను స్వీకరించారు. నవరస గాయని ఆమని పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సరస్వతి అవదాని దైవజ్ఞశర్మ, కళాపత్రిక సంపాదకులు మహ్మద్ రఫీ , యువకళావాహిని లంకా లక్ష్మీనారాయణ, బండారు సుబ్బారావు, రఘు, కుసుమ భోగరాజు, గాంధీ పాల్గొన్నారు.