ఆగకుండా..గమ్యం చేరేలా..!నగర వ్యాప్తంగామరిన్నిసిగ్నల్ ఫ్రీ రోడ్లు నగర వ్యాప్తంగా రహదారులను సిగ్నల్ ఫ్రీ రోడ్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలను విడతల వారీగా ప్రభుత్వం అందిస్తున్నది. ఇప్పటి దాకా ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉన్న జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుని తీవ్ర ఇక్కట్లకు గురైన వాహన దారులు ఫ్లై ఓవర్, ఆర్యూబీ, ఆర్వోబీలు ఏర్పాటైన తర్వాత నిర్ణీత సమయాల్లో తమ గమ్య స్థానాలకు చేరుతున్నారు. హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాలను చీల్చుకుంటూ సాకారమవుతున్న వ్యూహాత్మక దారులతో నగరవాసులు ఊరట పొందుతున్నారు.
శరవేగంగా విస్తరిస్తున్న మహానగరంలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వతంగా చెక్పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించి రూ.22వేల కోట్ల వ్యయంతో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కింద ఎక్కువగా వెస్ట్, ఈస్ట్ జోన్ పరిధిలో ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం పూర్తి చేసి విడతల వారీగా అందుబాటులోకి తీసుకువచ్చి ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేసింది. పురోగతిలో ఉన్న ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.440.98 కోట్లతో ఏడు ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1158 కోట్లతో 10 చోట్ల జరిగే ప్రాజెక్టులను వచ్చే డిసెంబరు నెలాఖరు కల్లా పూర్తి చేయాలన్న నిర్ధేశిత లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకున్నారు. గడువులోగా ఈ ప్రాజెక్టులను ప్రారంభించేందుకుగాను పనుల్లో వేగం పెంచారు. ఎలివేటెడ్ ఫ్లై ఓవర్, అండర్పాస్, స్ట్రీల్ బ్రిడ్జి పనులు నిర్మాణంలో ఉండగా, దాదాపుగా పది చోట్ల 80శాతం మేర పనులు పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. రాబోయే ఐదు నెలల్లో విడతల వారీగా ఈ ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు స్పష్టం చేశారు.