సిటీబ్యూరో, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): మహా నగరంలో బాల బాలికలు, యువజనుల ఆరోగ్యానికి జీహెచ్ఎంసీ పెద్ద పీట వేస్తున్నది. వారి ఉన్నతికి ఉపయోగపడే విధంగా ఎన్నో రకాల ఆటలకు సంబంధించి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆటలను ప్రోత్సహించేలా ఎప్పటికప్పుడు నూతన క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. గౌలిపుర స్టేడియం, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఇండోర్ స్టేడియంలను నిర్మించడం, 75 చోట్ల క్రీడా మైదానాల్లో వివిధ క్రీడలకు సంబంధించి కావాల్సిన పరికరాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే రూ.30.6 కోట్లతో ఎనిమిది చోట్ల నూతన క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగానే కూకట్పల్లి జోన్ పరిధిలోని గాజుల రామారంలోని టీఎస్ఐఐసీ కాలనీలో అధునిక హంగులతో స్పోర్ట్స్ థీమ్ పార్క్ను నిర్మించారు. రెండెకరాల విస్తీర్ణంలో రూ. 2.30 కోట్లతో నిర్మించిన ఈ పార్కులో క్రికెట్, బాస్కెట్ బాల్, బాడ్మింటన్, ఫుట్బాల్, స్కేటింగ్, సైక్లింగ్ ఇలా పలు క్రీడలను ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేశారు. క్రీడాకారుల కోసం త్వరలోనే ఈ పార్కును అందుబాటులోకి తీసుకు వస్తామని జోనల్ కమిషనర్ మమత ఈ సందర్భంగా చెప్పారు.
క్రికెట్ కోర్టు, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, బాస్కెట్ బాల్ కోర్టు, మల్టీపర్పస్ వాలీబాల్, ఓపెన్ బాడ్మింటన్ కోర్టు, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, సెక్యూరిటీ రూమ్, అడ్మిన్ రూమ్, రెస్ట్ రూమ్స్, స్టోర్ రూమ్, ఫుట్బాల్ కోర్టు, గజిబో, ఫుడ్ కోర్టు ఏరియాలు ఉన్నాయి.
పిల్లలు, యువతకు క్రీడల పట్ల అసక్తి ఉన్నా ప్రోత్సాహం ఉండదు. తల్లిదండ్రులు ప్రోత్సహించినా అందుబాటులో మైదానాలు ఉండవు. నగరవాసులను, ప్రధానంగా పిల్లలను క్రీడల పట్ల ప్రోత్సహించి ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ క్రీడలకు పెద్ద పీట వేస్తున్నది. క్రీడా మైదానాల అభివృద్ధి, వసతుల కల్పన, కొత్త మైదానాల ఏర్పాటు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ల నిర్మాణంతో పాటు సమ్మర్ కా్ంయపుల ద్వారా పిల్లలను క్రీడల పట్ల ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. అంతే కాకుండా వెటరన్ క్రీడాకారులకు నెలకు రూ.7,500లు, రూ.10 వేల చొప్పున జీహెచ్ఎంసీ ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఈ క్రీడా స్థలాలను ప్రైవేట్ స్కూళ్లు ఉపయోగించుకునేలా జీహెచ్ఎంసీ వెసులుబాటు కల్పించింది. – మమత, జోనల్ కమిషనర్, కూకట్పల్లి