ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలోని వెలోడ్రమ్ (సైక్లింగ్) స్టేడియంలో జరుగుతున్న 72వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్-2021లో క్రీడాకారులు రికార్డులు సృష్టిస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్), సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. టీం స్పిరిట్ ఈవెంట్లో మణిపూర్ బృందం ఒక నిమిషం 2.30 సెకన్లతో జాతీయ రికార్డును నెలకొల్పింది. నాలుగు కిలోమీటర్ల వ్యక్తిగత సీనియర్ విభాగంలో రైల్వేస్కు చెందిన అమిత్ మం గ్లా నాలుగు నిమిషాల 48.77 సెకన్లు, మూడు కిలోమీటర్ల వ్యక్తిగత సీనియర్ మహిళల విభాగంలో రాజస్థాన్కు చెందిన మోనికా జాట్ నాలుగు నిమిషాల 10.03 సెకన్లతో రికార్డులు సృష్టించారు.
ఆదివారం పోటీలు జరిగిన అన్ని విభాగాలలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి పతకాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ మణీందర్పాల్ సింగ్ హాజరై మాట్లాడుతూ, ఒకానొక సమయంలో సైక్లింగ్ విభాగంలో దేశంలోనే హైదరాబాద్ కేంద్రంగా ఉండేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో సైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ కంచర్ల రాజ్కుమార్, అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి, కార్యదర్శి కటం దత్తాత్రేయ, కో చైర్మన్ అనురాగ్ సక్సేనా, ప్రతినిధులు విజయ్, డాక్టర్ మాక్స్వెల్ ట్రేవోర్, వెంకట్ కుంభం తదితరులు పాల్గొన్నారు.