సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): మధుమేహ రోగుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా.. కష్టమే. ముఖ్యంగా పాదాల పుండ్లు అనేది ఓ విపత్తు లాంటిది. వీటితో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుండటంతో ఉస్మానియా వైద్యశాలలో డయాబెటిక్ ఫుట్ క్లినిక్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సమస్య తీవ్ర రూపం దాల్చకుండా (ఆంప్యుటేషన్ వరకు రాకుండా).. ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ సెంటర్ ప్రారంభించిన పది రోజుల్లోనే 225 మంది ఓపీ సేవలు పొందడం గమనార్హం. కాగా, ప్రతిరోజు జనరల్ ఓపీకి కనీసం 200 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు వస్తుంటే.. అందులో పాదాల పుండ్లతో బాధపడేవారు 15 నుంచి 20 మంది ఉంటున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు ఈ క్లినిక్లో ప్రధాన విభాగాల వైద్యులను సైతం అందుబాటులో ఉంచారు. స్క్రీనింగ్ చేసిన వెంటనే చికిత్స అందిస్తుండటంతో రోగులకు నిరీక్షణ తప్పడంతో పాటు సత్వర వైద్యం లభిస్తున్నది.
స్క్రీనింగ్ వెంటనే చికిత్స..
గతంలో రోగులు రాగానే వైద్యపరీక్షల కోసం పంపేవారు. దీంతో రోగులు ఆ పరీక్షలన్నీ చేయించుకోవడానికి మరోసారి రావాల్సి వచ్చేది. పరీక్షల నివేదికలు తీసుకోవడానికి మరో రోజు, వచ్చిన నివేదికలను వైద్యులకు చూపించేందుకు మరోసారి.. ఇలా చికిత్స కోసం మూడునాలుగు సార్లు దవాఖానకు తిరగాల్సిన పరిస్థితి ఎదురయ్యేది. డయాబెటిక్ ఫుట్ క్లినిక్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. రోగి రాగానే అవసరమైన న్యూరోపతి, డాప్లర్ స్టడీ తదితర అన్ని రకాల వైద్యసేవలను ఈ క్లినిక్లోనే నిర్వహిస్తున్నారు. నివేదికలను సైతం అప్పటికప్పుడే అందజేస్తుండటంతో వాటిని తీసుకుని రోగులు వెంటనే వైద్యులను సంప్రదిస్తున్నారు. దీంతో ఒకే రోజులో రోగులకు వైద్యపరీక్షలతో పాటు చికిత్స కూడా అందుతుంది. దీంతో రోగులకు నిరీక్షణ తప్పడంతో పాటు సత్వర వైద్య సేవలు లభిస్తున్నాయి.
ప్రతిరోజు 15 నుంచి 20 మంది..
డయాబెటిక్ ఫుట్ క్లినిక్ కు ప్రతిరోజు 15 నుంచి 20 మంది వచ్చి చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువగా పాదంలో స్పర్శ లేక న్యూరోపతి సమస్యతో బాధపడుతున్న వారే ఉంటున్నారని.. వీరికి ప్రత్యేక చికిత్స అందించి సమస్య తీవ్రరూపం దాల్చకుండా చూస్తున్నామని ఎండోక్రనాలజీ విభాగాధిపతి డాక్టర్ రాకేశ్సాహె తెలిపారు. మరికొంత మంది డయాబెటిక్తో కాళ్లకు ఏర్పడిన పుండ్లు, ఇతర గాయాలకు డ్రస్సింగ్ చేయించుకుంటున్నారని వివరించారు. ప్రారంభించిన ఈ పది రోజుల్లో ఆంప్యూటేషన్ (కాలు, వేళ్లు తొలగింపు) చేయాల్సిన కేసులు రాలేదన్నారు. ప్రతిరోజు ఓపీకి కనీసం 200 మంది డయాబెటిక్ రోగులు వస్తున్నారని.. వారిలో డయాబెటిక్ ఫుట్ సమస్య ఉన్న రోగులు 15 నుంచి 20 మందికి వరకు ఉంటున్నట్లు వైద్యులు వివరిస్తున్నారు.
ఒకేచోట 8 ప్రధాన విభాగాలు..
డయాబెటిక్తో బాధపడే రోగులు ముఖ్యంగా కిడ్నీ, ఆర్థో, న్యూరో, కార్డియో తదితర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి సంబంధిత వైద్యుల సేవలు అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రోగి ఆయా వైద్యుల కోసం తిరగాల్సిన అవసరం లేకుండా అవసరమైన 8 ప్రధాన విభాగాల వైద్యులను ఈ డయాబెటిక్ ఫుట్ క్లినిక్ లోనే అందుబాటులోకి తీసుకువచ్చారు.
ప్రతి పదిమందిలో నలుగురికి మధుమేహం..
ప్రస్తుతం 30 ఏండ్లు దాటిన వారిలో సైతం డయాబెటిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని.. ఈ క్రమంలో ప్రతి 10 మందిలో నలుగురు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని.. రోజురోజుకూ ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నందున ఉస్మానియాలో ప్రత్యేకంగా డయాబెటిక్ ఫుట్ క్లినిక్ ప్రారంభించామని.. ఈ క్లినిక్కు రోగులు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్, ఎండోక్రనాలజి విభాగాధిపతి డాక్టర్ రాకేష్ సాహె తెలిపారు.
అందుబాటులో ఉండే వైద్యులు..
నెఫ్రాలజిస్టు ఆర్థోపెడిక్ సర్జన్ జనరల్ సర్జన్ కార్డియాలజిస్టు ప్లాస్టిక్ సర్జన్ ఆప్తమాలజిస్టు ఎండోక్రనాలజిస్టు న్యూరాలజిస్టు