భవన నిర్మాణ అనుమతి ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ చక్కటి ఫలితాలిస్తున్నది. ఆన్లైన్ పోర్టల్లో స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, భవన ప్రణాళికతో స్వీయ ధ్రువీకరణ చేస్తూ దరఖాస్తు చేసిన వెంటనే తక్షణ అనుమతి (ఇన్స్టెంట్ అప్రూవల్) ఇస్తారు. ఇలా అనుమతి పొందిన స్థలాలను జోనల్ స్థాయిలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి 21 రోజుల వ్యవధిలోపు ఫైనల్ అప్రూవల్ ఇస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో 631 దరఖాస్తులతో బడంగ్పేట కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలవగా, 601 దరఖాస్తులతో రెండోస్థానంలో బోడుప్పల్ నిలిచింది. ఒకప్పుడు భవన నిర్మాణ అనుమతి తీసుకోవాలంటే పెద్ద ప్రయాస. అధికారుల కొర్రీలు, దళారుల బెడదతో నానాకష్టాలు పడేవారు. ఇప్పుడు ఎవరి అవసరం లేకుండా ఆన్లైన్ దరఖాస్తుతోనే అనుమతులు లభిస్తుండడంతో ఇండ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి.
నిర్మాణ రంగ అనుమతుల ప్రక్రియలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ బీపాస్కు విశేష ఆదరణ లభిస్తున్నది. నిర్మాణ రంగానికి సంబంధించి ఇలా దరఖాస్తు చేసుకున్న వెంటనే అలా అనుమతులు వస్తుండటంతో ఇండ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో కొత్త నిర్మాణాల కళ సంతరించుకుంటున్నది. అపార్ట్మెంట్లలో ఉండి విసిగిపోయిన వారంతా శివార్లలోనే ఖాళీ స్థలాలు అధికంగా ఉండటంతో శివార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరైతే గతంలోనే తీసిపెట్టుకున్న స్థలాల్లో కొత్తగా తమ అభిరుచులకు అనుగుణంగా ఇండ్లను నిర్మించుకుంటున్నారు.
ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలలో బడంగ్పేట 631దరఖాస్తులతో మొదటి స్థానంలో నిలువగా.. బోడుప్పల్ 601దరఖాస్తులతో రెండవస్థానంలో, మహబూబ్నగర్ 530 దరఖాస్తులతో మూడవ స్థానంలో నిలవడం గమనార్హం. కాగా టీఎస్ బీ పాస్ విధానం గతేడాది నవంబరు 16న రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. దాదాపు 100 రోజుల వ్యవధిలో 10,870 దరఖాస్తులు స్వీకరించగా, 70శాతం మేర దరఖాస్తులను పోస్ట్ వెరిఫికేషన్ ద్వారా 21రోజుల వ్యవధిలో అనుమతులు ఇచ్చారు.
ఒకప్పుడు ఇంటి నిర్మాణ అనుమతులు పొందాలంటే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కొర్రీల మీద కొర్రీలతో దరఖాస్తు అమోదం కోసం దరఖాస్తుదారుడు ఎంతో శ్రమకోర్చే వారు. కానీ టీఎస్ బీ పాస్ రాకతో ఇండ్ల నిర్మాణ అనుమతుల ప్రక్రియ సులభతరమైంది. అలా దరఖాస్తు చేసుకున్న వెంటనే టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వెంటనే అనుమతులు ఇచ్చేస్తున్నారు. ప్రధానంగా 76 నుంచి 600 చదరపు గజాల వరకు స్థలంలో 10మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు స్వీయ ధ్రువీకరణతో అనుమతులు పొందుతున్నారు. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, భవనం ప్లాన్ తదితర వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే వీరికి ఆమోదం (ఇన్స్టంట్ అఫ్రూవల్) లభిస్తుంది. ఇలా స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి పొందిన స్థలాలను జోనల్ స్థాయిలో ప్రత్యేకంగా నియమించిన టాస్క్ఫోర్స్ కమిటీ పోస్ట్ వెరిఫికేషన్ జరిపి 21రోజుల వ్యవధిలోనే అనుమతులు ఇస్తుంది.
జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణ రంగ అనుమతులు రెండు రకాలుగా లభిస్తున్నాయి. డీపీఎంఎస్ డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్)తో పాటు టీఎస్ బీ పాస్ ద్వారా అనుమతులు ఇస్తున్నారు. ఎక్కువ శాతం ఎల్బీనగర్, అత్తాపూర్, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో 600గజాల లోపు స్థలాల్లో కట్టేందుకు ఎక్కువగా టీఎస్ బీ పాస్ కింద దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం.
టీఎస్ బీ పాస్ వెబ్సైట్లో www.tsbpass. telangana.gov.in దరఖాస్తు చేసుకోవాలి. యజమానులు, డెవలపర్లు, ప్రతినిధులు మీ సేవా కేంద్రం, టీఎస్ బీపాస్ మొబైల్ యాప్ (అండ్రాయిడ్, ఐఎస్ఓ) ద్వారా ఆయా నిర్మాణానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా కాల్ సెంటర్ను 040-22666666 అందుబాటులోకి తీసుకువచ్చారు.
బిల్డింగ్ అనుమతులు, భూమి వినియోగ ధ్రువ పత్రాలు, టీడీఆర్ బ్యాంక్, లే అవుట్, భూ వినియోగ మార్పు, ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఎన్ఓసీలు, ఎల్ఆర్ఎస్, 21 రోజుల్లో అనుమతి. జలమండలి, ఎలక్ట్రిసిటీ, టీడీఆర్, ఎస్ఆర్ఓ, నీటి పారుదల, జేఎన్టీయూ, విమానాశ్రయం, ఎన్ఎంఏ విభాగాలకు సంబంధించి ఒకే చోట ఎన్ఓసీలు అందనున్నాయి.