హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఆపన్నులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా మరో పేద కుటుంబానికి అండగా నిలిచారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా చూడటంతోపాటు భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వివరాల్లోకెళ్తే.. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన కదాసి అనూష కుమారుడు విశ్వ (17నెలలు)కు రెండు నెలల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. దీనికి ఆ పేద కుటుంబం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలని అనూష ఆదివారం ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేసింది. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్.. అనూష వివరాలు తెలుసుకొని సాయం చేయాలని మంత్రి గంగుల కమలాకర్కు సూచించారు. దీంతో మంత్రి గంగుల తన క్యాంపు కార్యాలయానికి అనూషను పిలిపించుకొని తక్షణ సాయంగా రూ.10 వేలు అందజేశారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విశ్వకు భవిష్యత్తులో అవసరమైన వైద్య సాయాన్ని అందించడంతోపాటు సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందేలా కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రతి నెలా అనూష కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. పేద వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని చెప్పారు. మంత్రి కేటీఆర్ ఒక్క ట్వీట్ దూరంలోనే అందరికీ అందుబాటులో ఉంటూ ఆపన్నులకు సాయం చేసేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. అనంతరం అనూష ట్విట్టర్ ద్వారా మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్కు ధన్యవాదాలు తెలిపారు.