సికింద్రాబాద్ : ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న రెండు ప్రత్యేక రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనాకు ముందు నడుస్తున్న ఈ రైళ్లను నిలిపివేశారని, ప్రస్తుతం, ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నర్సాపూర్-నిడదవోలు (07241), నిడదవోలు-నర్సాపూర్ (07242)ల మధ్య నడిచే రైళ్లను తిరిగి నడుపుతున్నట్లు ప్రకటించారు. ఈ రైళ్లు ఏప్రిల్ 2 నుంచి ప్రతి రోజు రాకపోకలు సాగిస్తాయని, నర్సాపూర్లో ఉదయం 8.40 గంటలకు బయలు దేరే రైలు, అదే రోజు 10.40 గంటలకు నిడదవోలు చేరుకుంటుంది.
తిరిగి అదే రైలు నిడదవోలులో ఉదయం 11.45 గంటలకు బయలు దేరి నర్సాపూర్కు మధ్యాహ్నం 1.45కు చేరుకుంటుంది. ‘డెమూ ఎక్స్ప్రెస్’ స్పెషల్ రైళ్లుగా ఇవి ఈ మార్గంలో ఇక నుంచి రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైలు వేళల్లో మార్పులు… హెచ్ఎస్ నాందేడ్ – అమృత్సర్ జంక్షన్ల మధ్య నడిచే (02715) సచ్కంద్ స్పెషల్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఈనెల 28న ఉదయం 9.30 గంటలకు రావాల్సి ఉండగా, అది మధ్యాహ్నం 12.00 గంటలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.