కరోనా ఉధృతి నేపథ్యంలో రైల్వేలకు సంబంధించిన అన్ని ఆరోగ్య కేంద్రాలలో సమయానుకూలంగా వైద్యం అందించడానికి అదనపు పడకలు సిద్ధం చేయాలని డివిజన్ రైల్వే మేనేజర్లను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఆదేశించారు. రైళ్ల భద్రత, సరుకురవాణా, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొవిడ్ తీవ్రత, అందించాల్సిన వైద్య సదుపాయాలపై బుధవారం ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు.
రైల్వే బోర్డు సూచనల ప్రకారం స్టేషన్లలో పొగ తాగకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని స్టేషన్లలో తరుచుగా శానిటైజేషన్ చేయాలని ఆదేశించారు. బొగ్గు, సిమెంట్, గ్రానైట్, జిప్సం, ఫ్లైయాస్ వంటి సరుకు రవాణా అభివృద్ధికి చర్యలు తీసుకొని.. బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ల పనితీరు మెరుగుపరుచాలన్నారు. రైతులు, వ్యాపారస్తులకు ప్రయోజనం కలిగే విధంగా మరిన్ని కిసాన్ రైళ్లను నడిపే అంశంపై జీఎం దృష్టి సారించారు.