సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే ట్రాక్లను మరింత పటిష్ట పరిచే అంశంపై రైల్వే అధికారులు దృష్టి సారించారు. అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఉన్న రైల్వే వంతెలను గుర్తించి, వాటి పటిష్టతపై అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. ఇంజినీర్ల సహాయంతో వంతెనల వద్ద పరిస్థితులు అంచనా వేసి, అవసరమైతే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అన్నారు. వాతావరణం, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వెనువెంటనే క్షేత్ర స్థాయి అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. భద్రతా చర్యల్లో రాజీలేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.