సిటీబ్యూరో, జూలై 20(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో యాత్రికుల కోసం మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ ఐఆర్సీటీసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయి. ఇందులో ఉత్తర భారత యాత్రలో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి, హరిద్వార్, అమృతసర్ నుంచి హైదరాబాద్ చేరుతుంది. ఇది ఆగస్టు 29 నుంచి బయలు దేరుతుంది. మహాలయ పిండ్దాన్ యాత్రలో వారణాసి, గయ, ప్రయాగ్రాజ్ ఉంటాయి. ఇది సెప్టెంబర్ 25న ప్రారంభమవుతుంది. దక్షిణ భారత యాత్రలో కాంచిపురం, మహాబలిపురం, తంజావూర్, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి నుంచి హైదరాబాద్కు చేరుతుంది. ఇది అక్టోబర్ 19న బయలు దేరుతుంది. పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ను సంప్రదించాల్సి ఉంది. ఈ మేరకు మంగళవారం ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కిశోర్ ప్రకటన విడుదల చేశారు