సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో భారతీయ రైల్వేలు ప్రయాణికుల రాకపోకలకు క్రమంగా ప్రాధాన్యత తగ్గిస్తున్నాయి. సరుకు రవాణాపైనే పూర్తిగా దృష్టి సారించి… ఆదాయ మార్గాలే లక్ష్యంగా పని చేస్తున్నాయి. కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు, సూపర్ ఫాస్ట్ రైళ్లను కూడా రద్దు చేసిన అధికారులు.. వాటిని పూర్తిగా సరుకు రవాణా కోసం వినియోగిస్తున్నారు. కిసాన్ రైళ్ల కోసం ప్రత్యేక మాల్గాడీలను ఏర్పాటు చేయకుండా రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లలో ఉండే స్లీపర్, ఏసీ కోచ్లలో సరుకు లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్నారు. గత జనవరి నుంచి దేశ వ్యాప్తంగా దాదాపు 150 కిసాన్ రైళ్లను ప్రారంభించారు.
లాక్డౌన్ నేపథ్యంలో ఇండియన్ రైల్వే అనేక ప్రయోగాలు ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి? బొగ్గు క్షేత్రాలు, జిప్సం వంటి ఫ్యాక్టిరీలకు కొత్త రైల్వే మార్గాలను నిర్మిస్తున్నది. అందుకోసం ఇప్పుడున్న ట్రాక్లు సరిపోక పోవడంతో రెండో లైను, మూడో లైను, నాలుగో లైను పేరుతో కొత్త రైల్వే మార్గాలను ఏర్పాటు చేస్తోంది. పైగా మాల్గాడీల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా ట్రాకులను పటిష్ట పరుస్తోంది. సిగ్నల్ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు వివిధ మార్గాల్లో విద్యుదీకరణ చేస్తున్నారు.