న్యూఢిల్లీ : అల్లోపతి, ఆధునిక వైద్యంపై రాందేవ్ బాబా అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఎయిమ్స్ వైద్యులు మంగళవారం బ్లాక్ డేను పాటిస్తున్నారు. కరోనా వ్యాధిని ఆధునిక వైద్యం నయం చేయలేదని యోగ గురు చేసిన అసంబద్ధ వ్యాఖ్యలకు నిరసనగా ఎయిమ్స్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఈ నిరసనలకు పిలుపు ఇచ్చింది. కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడిన సమయంలో దేశ ప్రజలను కాపాడుకునేందుకు ప్రాణాలను లెక్కచేయకుండా వైద్యులు కొవిడ్ యోధులుగా మారి సేవలందిస్తుంటే వారిపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని డాక్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.
యోగ గురు వ్యాఖ్యలు దేశ ఆరోగ్య వ్యవస్ధల నిర్వీర్యానికి దారితీసే విధంగా ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రాందేవ్ పై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కాదని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ పై అసత్య ప్రచారం చేసిన రాందేవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎయిమ్స్ వైద్యుల అసోసియేషన్ కోరింది. కాగా రాందేవ్ బాబాపై దేశ ద్రోహం కింద చర్యలు చేపట్టాలని ఐఎంఏ ఇప్పటికే డిమాండ్ చేయగా ఆయనపై ఐఎంఏ ఉత్తరాఖండ్ పరువు నష్టం దావా వేసింది.