కాలుష్యం లేకుండా, సహజ వనరులను ధ్వంసం చేయకుండా, పర్యావరణ హితంగా విద్యుత్ ఉత్పత్తికి సూర్యరశ్మి (సోలార్) కేంద్ర బిందువుగా మారింది. దీంతో సోలార్ విద్యుత్ వైపు నగర వాసులు క్రమంగా మొగ్గు చూపుతున్నారు. మారుతున్న జీవన విధానంలో విద్యుత్ వినియోగం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఉత్పత్తి, వినియోగం మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోవడం ఒకవైపు, మరోవైపు ప్రకృతి సిద్ధ్దంగా ఏర్పడిన సహజ వనరులు కండ్ల ముందే కరిపోతున్న తరుణంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తే అసలైన ప్రత్మామ్నాయంగా మారింది.పట్టణాల్లోని ఇండ్ల మీద సైతం సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసి విద్యుత్ను ఉత్పత్తి చేసే కార్యక్రమం మరింత
ఊపందుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 9 సర్కిళ్లలో 8,078 మంది విద్యుత్ వినియోగదారులు తమ ఇండ్ల వద్ద సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రతి రోజూ 105 మెగావాట్ల నుంచి 150 వరకు సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఎండ,వాన, చలి కాలాలను బట్టి ఆయా ఇండ్లపై ఏర్పాటు చేసుకున్న ప్యానళ్ల సామర్థ్యాన్ని (3కిలో వాట్స్ నుంచి మొదలుకొని 75 కిలో వాట్స్) బట్టి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఉంటుంది. అయితే వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సోలార్ విద్యుత్ ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటే చేసే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ఇతరులకైతే 80శాతం వరకు మాత్రమే సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. సింగిల్ ఫేజ్ వినియోగదారుడు 5 కిలో వాట్స్ సామర్థ్యం ఉన్న సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్ను ఏర్పాటు చేసుకోవచ్చు.
గ్రేటర్లో కొత్తగా ఇండ్ల నిర్మాణం చేపట్టే వారు సోలార్ ప్యానల్స్ను తప్పని సరిగా ఏర్పాటు చేసుకుంటున్నారు. సామాన్య, మధ్య తరగతి వర్గాలు మినహాయిస్తే సంపన్నులు, సెలబ్రెటీలు సోలార్ విద్యుత్ కోసం రూఫ్ కనెక్షన్లు తీసుకుంటున్నారని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఐదేండ్ల కిత్రం 1 కిలోవాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుండగా, ప్రస్తుతం రూ.35-40వేల వరకే ఖర్చవుతున్నది.దీంతో ప్రతి నెలా విద్యుత్ బిల్లులు రూ.2నుంచి 3వేలు చెల్లించే వారు వెయ్యి కూడా చెల్లించడం లేదు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ, హైరేంజ్ అపార్టుమెంట్ వంటి ప్రాజెక్టు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి, తమకు అవసరమైన విద్యుత్లో కొంత భాగాన్ని వారే ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు సిద్ధ్దం చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు అమలు చేస్తోంది. 2016 వరకు ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేసి 2020లో కొత్తగా వాటిని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం గృహ వినియోగదారులు, ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే 100శాతం సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా అవసరమైన సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసి, దాన్ని గ్రిడ్కు అనుసంధానం చేస్తున్నారు.