కరోనా రెండోదశ తీవ్ర ప్రభావం దృష్ట్యా వైరస్ బారిన పడిన వారికి అండగా నిలిచేందుకు పలు స్వచ్ఛంద, సేవా సంస్థలు, వ్యక్తులు ముందుకొస్తున్నారు. తోచిన విధంగా ఆహారం, శానిటైజర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతరాత్ర ఉచితంగా అందజేస్తూ తమ దాతృత్వం చాటుకుంటున్నారు. ఆ కోవలోనే ప్రపంచవ్యాప్తంగా ఆరున్నర వేలమంది మహిళలతో సమూహంగా ఏర్పడిన నారీ సేన సంస్థలోని అమ్మలంతా కరోనా బాధితులకు తమవంతు చేయూత అందిస్తున్నారు. పాజిటివ్తో హోం ఐసోలేషన్లో ఉంటూ ఎలాంటి వసతి లేని వారికి రెండుపూటలా భోజనాన్ని ఉచితంగా ఇంటికే అందిస్తున్నారు. హైదరాబాద్తోపాటు విశాఖపట్నం, బెంగళూరుల్లో ప్రతిరోజు వందలమంది కరోనా బాధితులకు ఇండ్ల వద్దకే వెళ్లి అందిస్తున్నామని నారీసేన నిర్వాహకురాలు లతాచౌదరి బొట్ల పేర్కొన్నారు. హోం ఐసోలేషన్లో ఉంటూ ఇంట్లో భోజనం సౌకర్యం లేని వారు తమకు వాట్సాప్ ద్వారా తగిన ఆధారాలు, అడ్రస్తో సమాచారం పంపిస్తే సంస్థ ప్రతినిధులు డోర్ డెలివరీ చేస్తారని చెప్పారు. రెండోదశ కరోనా కారణంగా కుటుంబాల్లోని వారందరూ వైరస్ బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారని, వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నారీసేన ద్వారా ఇంటి వద్దకే ఉచితంగా భోజనం అందిస్తున్నామన్నారు. ప్రధానంగా కొవిడ్ బాధితులు త్వరగా కోలుకునేందుకు పౌష్టికాహారంతో కూడిన పండ్లు, ఇతర బలవర్థక ఆహార పదార్థాలను చేరవేస్తున్నామని, ఉచిత భోజనం కావాల్సిన వారు హైదరాబాద్లో అయితే 9182225202, 9000118870, 9963425551 నంబర్లను సంప్రదించాలన్నారు.