పహాడీషరీఫ్, జూన్ 9 : అక్షరం విజ్ఞానాన్ని నేర్పిస్తుంది..చదువు మనిషికి జ్ఞానాన్నే కాదు మంచి సమాజాన్ని అందిస్తున్నది అక్షర సత్యం. దీన్ని గట్టిగా నమ్మిన ప్రవాస భారతీయుడు తన ప్రాంతంపై ఉన్న మమకారంతో పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నాడు. పురాతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కూల్చివేయించి కార్పొరేట్ పాఠశాలకు దీటుగా నిర్మించి నిరుపేద విద్యార్థులకు చక్కటి విద్యనందిస్తున్నారు. సౌదీలోని జామియా ఉస్మాన్ బిన్ ఆఫాన్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకుడు ఉమర్ బిన్ మైలాన్ వ్యాపారి. తొలినుంచి చదువుపై మమకారం ఉండేది. పేద విద్యార్థులు చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో ఇక్కడి కొత్తపేటలో 500 గజాల స్థలంలో ఉన్న పురాతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కూల్చివేయించారు. రూ.80 లక్షల వ్యయంతో రెండు అంతస్థుల్లో 14 తరగతి గదులు, విశాలమైన హాల్ను నిర్మింపజేశారు. త్వరలో దీన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రారంభించనున్నారు.
ఉమర్ బిన్ మైలాన్ సౌదీలో వ్యాపారం చేస్తుంటాడు. మా కుటుంబానికి సమీప బంధువు. విద్యకు ప్రాముఖ్యత ఇస్తాడు. సేవ చేయాలనే గుణం కలవాడు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని, పేరు గొప్ప కాదని, తాను చేసే సహాయంతో విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఆయన ఆలోచన. నాకు అప్పగించిన పని పూర్తి చేశాను. నేను కూడా సొంతంగా రూ.లక్ష వరకు ఖర్చు చేసిన. -ఉమర్ బామ్, బాలాపూర్ మండల ఉపాధ్యక్షుడు
విద్యార్థులకు చక్కటి విద్యనందించే లక్ష్యంతో ఉమర్ బిన్ మైలాన్ ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్కు దీటుగా అభివృద్ధి చేశారు. చక్కటి గాలి, వెలుతురు వచ్చేలా విశాలంగా నిర్మించారు. ఉమర్ బిన్ను ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలి. -అమర్నాథ్రెడ్డి, కొత్తపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
జామియా ఉస్మాన్ బిన్ ఆఫాన్ ఎడ్యుకేషన్ సొసైటీ పేద,బడుగు, బలహీన వర్గాలు చదువుకునే పాఠశాలను అభివృద్ధి చేయడానికి ముందుకురావడం శుభపరిణామం. మండల విద్యాశాఖ, విద్యాకమిటీ తరపున సొసైటీ వారికి ప్రత్యేక అభినందనలు. – కృష్ణ, మండల విద్యాధికారి