హఫీజ్పేట, మే 31 : కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్తో చాలామంది నిరుపేదలు, కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సోకిందంటే ఇకవారి పరిస్థితి భయానకం. అందులోనూ ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చి కూలీ పనులు చేసుకుంటూ వైరస్ సోకిన వారిది ఇంకో దీనగాథ. చాలీచాలని గదుల్లోనే ఉంటూ బయటకు రాలేక, ఎవరికి చెప్పుకోలేక పడుతున్న తిప్పలు ఇన్నీఅన్నీకావు. ఇలాంటి దుర్భర పరిస్థితులను దగ్గరి నుంచి గమనించిన ఆ దంపతులు చలించిపోయారు. కొవిడ్ సోకిన వారిలో కొందరికైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కొవిడ్ రోగులకు బలవర్థకమైన ఆహారమందిస్తూ కోలుకునేలా చేస్తున్నారు. కరోనా వచ్చిందని తెలిస్తే ఆ ఇండ్ల వైపు కన్నెత్తి చూడడానికే జంకుతున్న ప్రస్తుత సమయంలో నిత్యం 100మందికి 25రోజులుగా ఉదయం, రాత్రి వేళల్లో ఉచితంగా ఆహారమందిస్తున్నారు హఫీజ్పేట డివిజన్ గంగారం బస్తీకి చెందిన కంది జ్ఞానేశ్వర్, కస్తూరిజ్యోతి దంపతులు.
వీరు నివాసముండే ఇంటి పక్కనే మహారాష్ట్రకు చెందిన ఓ వలస కూలీ కరోనా బారినపడ్డాడు. సొంతూరికి వెళ్లేందుకు యత్నించగా అక్కడ కూడా లాక్డౌన్ ఉండటంతో చేసేదిలేక ఇక్కడే ఉన్నాడు. ఆ సమయంలో అతను పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. గంగారంబస్తీలో ఇలాంటి వారు చాలామందే ఉన్నారు. ఉన్నదాంట్లో ఎంతోకొంత సాయంచేయాలని భావించి ఉచిత భోజనం పెట్టడం ప్రారంభించారు. మొదట ఒక్కరే అనుకున్నా ఆ తర్వాత ఎంతోమంది వీరిని ఆశ్రయించడం మొదలుపెట్టారు. బంధువులు, మిత్రులు, దాతలు ఎంతోమంది వీరి సేవకు తోడ్పాటునందించడంతో గత 25 రోజులుగా కొవిడ్ రోగులకు రెండు పూటలా చక్కటి భోజనం అందిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అందరూ ఇంటి పట్టునే ఉండటంతో కుటుంబ సభ్యులంతా వంటచేసి, ప్యాకింగ్ తదితరాలను సిద్ధం చేస్తూ కొంతమంది యువకుల సాయంతో బాధితులకు పంపిణీ చేస్తున్నారు.